మహారాష్ట్రకు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశమంతా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన ఏకంగా హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ ను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐశ్వర్య లాంటి కళ్లు కావాలంటే చేపలు తినాలని సూచించారు. రోజూ చేపలు తినడం వల్ల ఐశ్వర్య రాయ్‌కు ఉన్న కళ్ల మాదిరిగా మీ కళ్లు కూడా అవుతాయని మాట్లాడారు. 


మహారాష్ట్రలోని బీజేపీకి చెందిన మంత్రి విజయ్ కుమార్ గవిట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర మహారాష్ట్రలోని నందర్బర్ జిల్లాలో ఓ బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చేయగానే విపరీతంగా వైరల్ అయిపోయారు. 68 ఏళ్ల గిరిజన సామాజిక వర్గానికి చెందిన మంత్రి విజయ్ కుమార్ గవిట్. ఈయన కుమార్తె కూడా లోక్ సభ సభ్యురాలిగా ఉన్నారు. వేదికపై మాట్లాడుతూ.. చేప తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పడం మొదలుపెట్టారు. రోజూ చేప తింటే దాని ద్వారా శరీరానికి కావాల్సిన నూనెలు అందుతాయని వాటి ద్వారా శరీరం కాంతివంతం అవుతుందని చెప్పుకొచ్చారు.


‘‘రోజూ చేపలు ఎవరైతే తింటారో వారి శరీరం, కళ్లు మరింత కాంతిమంతం అవుతాయి. అలాంటివారిని ఎవరైనా చూడగానే ఆకర్షించేలా ఉంటారు. ఐశ్వర్యరాయ్ గురించి నేనో విషయం చెప్పనా? ఆమె మొదట్లో మంగళూరు తీర ప్రాంతంలో నివసించేవారు. ఆమె రోజూ చేపలు తినేవారు. ఆమె కళ్లను చూశారా? రోజూ చేపలు తింటే అలాంటి కళ్లు మీకు కూడా వస్తాయి’’ అని మాట్లాడారు.


ఈ రీతిలో కామెంట్లు చేసిన మంత్రిపై విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆయన పనికిమాలిన వ్యాఖ్యలు చేశారని కొట్టిపారేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిట్కారీ మాట్లాడుతూ.. మంత్రి తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ పని చేయాలని, ఆ దిశగా వ్యాఖ్యలు చేయాలని సూచించారు. అంతేకానీ, పనికిమాలిన వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. 


బీజేపీ ఎమ్మెల్యే నీతీష్ రాణే మాట్లాడుతూ.. ‘‘నేను రోజూ చేపల కూర తింటాను. నా కళ్లు కూడా ఐశ్వర్యా రాయ్ కళ్లలాగా అవ్వాల్సింది. ఎందుకు అవ్వలేదో నేను మంత్రి గవిట్ సాబ్‌ని అడుగుతా’’ అంటూ ఎద్దేవా చేశారు.