Loksabha Elections: దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం మార్చి 16న నగరా మోగించింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలను వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ/ లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి.  లోక్‌సభ పోలింగ్ అదే రోజు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల తేదీల్లోనే జాతీయస్ధాయి పోటీపరీక్షలతోపాటు, ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మే నెలలో పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఆయా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఎన్నికల వల్ల  పరీక్ష సెంటర్ల కేటాయింపులు, ప్రజా రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. దూరంగా సెంటర్ పడితే, అక్కడ సరైన సౌకర్యాలు లేకపోతే కష్టమవుతుందని భయపడుతున్నారు. మరోవైపు కొంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి అవకాశం లేకుండా పోతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూలుకు అనుకూలంగా గతంలో పలు పరీక్షల తేదీల్లో మార్పులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ మేరకు మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల తేదీల్లోనూ మార్పులు జరుగవచ్చని భావిస్తున్నారు.  


ఏయే తేదీల్లో ఏయే పరీక్షలు ఉన్నాయంటే?


➥ ప్రధానంగా తెలంగాణలో మే 9 నుంచి 12 వరకు TS EAPCET, ఏపీలో మే 13 నుంచి 19 వరకు AP EAPCET పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్దులు హాజరుకానున్నారు. తెలంగాణలో మే 13న పోలింగ్‌ జరుగనుంది. అంటే మే 12న పోలింగ్‌ కేంద్రాలను పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకొంటారు. ఈ నేపథ్యంలో ఎప్‌సెట్‌ పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందా? లేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యి. ఇంజినీరింగ్‌ పరీక్షలను సజావుగా నిర్వహించవచ్చని, అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుందన్న భావన అధికారుల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్‌, ఫార్మసీవిభాగం పరీక్షను వాయిదా వేయడ మా.. ? లేదా మొత్తానికి మొత్తం పరీక్షలను వాయిదా వేయాలా..? అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.


➥ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌ పరీక్షలు వాయిదాపడనున్నాయి. ఐసెట్‌ పరీక్షలను జూన్‌ 4, 5న నిర్వహిస్తామని కాకతీయ యూనివర్సిటీ అధికారులు గతంలో ప్రకటించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లలెక్కింపు కూడా జూన్‌ 4న జరుగనున్నది. అంటే, ఈ లెక్కన ఐసెట్‌ వాయిదావేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 


➥ తెలంగాణలోని  ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం మే 13 నుంచి 21 వరకు నిర్వహించే డిపార్టుమెంటల్‌ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై అధికారులు ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని తెలిసింది.


➥ మరోవైపు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి ఎన్నికల సమయంలోనే డిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామకాలకు  మే 9, 10, 13 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలమంది అభ్యర్థులు హాజరవుతుంటారు.


➥ ఇక మే 2 నుంచి 13 వరకు ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో విద్యార్థులు రాస్తుంటారు.


➥ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను మే 26న నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది.


➥ కేంద్రీయ విద్యాలయాల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన సీయూఈటీ యూజీ పరీక్షలు మే 15 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు.


➥ ఇక జేఈఈ 2024 మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించడానికి షెడ్యూలు ఖరారు చేశారు.


ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు, 7 విడతల్లో పోలింగ్..
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. పోలింగ్ వివరాలు వెల్లడించింది. సీఈసీ రాజీవ్ కుమార్ పూర్తి షెడ్యూల్‌ని వెల్లడించారు. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల తేదీలు ప్రకటించారు. 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్‌ జరగనున్నట్టు ఈసీ వెల్లడించింది.


ఏప్రిల్ 19న తొలి విడత లోక్‌సభ పోలింగ్‌ మొదలవుతుంది. ఏప్రిల్ 26న రెండో దశ  ఎన్నికలు జరుగుతాయి. మే7వ తేదీన మూడో దశ, మే 13 న నాలుగో దశ పోలింగ్ జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1వ తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఒకేసారి ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణలో లోక్‌సభకు, ఏపీలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...