Ram Temple Event : వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామాలయం (Ayodhya Ram Temple) ప్రారంభోత్సవానికి (Opening Ceremony)చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య ఉద్యమానికి ఊపిరిలూదిన ఎల్‌కే ఆడ్వాణీ (Lk Advani), మురళీ మనోహర్‌ జోషి (Murali Manohar Joshi ) ఆలయ ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటున్నట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు.  వారిద్దరిని రామాలయ ప్రారంభ కార్యక్రమానికి హాజరుకావద్దని విజ్ఞప్తి చేసింది రామమందిరం ట్రస్టు.  ఇంతలోనే అయోధ్య రామమందిరం ట్రస్ట్ నిర్ణయాన్ని మార్చుకుంది. రామ జన్మభూమి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి, పతాక స్థాయికి తీసుకెళ్లిన అగ్ర నేతలను రావొద్దని చెప్పడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇద్దరు నేతలను కలిసి ఆహ్వానాలను అందించింది విశ్వహిందూ పరిషత్‌. చారిత్రాత్మక వేడుకలకు హాజరయ్యేందుకు అంగీకరించారని వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ వెల్లడించారు. మరోవైపు 90 ఏళ్ల మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. 


జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ
జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ ట్రస్టు భావిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అయోధ్యలో వేర్వేరుచోట్ల 10 పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో 12 వేల నుంచి 15 వేల మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. సాధువులు సహా తాము ఆహ్వానించిన ప్రముఖులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. వేర్వేరు బృందాలకు ఈ బాధ్యతలు అప్పగించాం అని వివరించారు. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. జనవరి 20- 24 మధ్య జరిగే విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధాని మోడీ కూడా హాజరవుతారు. జనవరి 16న వేడుకలు మొదలై.. అదే నెల 22న ముగియనున్నాయి.


70 ఎకరాల విస్తీర్ణంలో మరో 7 ఆలయాలు
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గోనాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్టు ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ వస్తున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు.  


జాబితాలో సినీరంగ ప్రముఖులు
జాబితాలో సినీరంగం నుంచి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు. అలాగే పారిశ్రామిక రంగం నుంచి రతన్ టాటా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులు, భారత్ క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్, విరాట్ కోహ్లి  లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు  చివరి దశలో ఉంది. మరోవైపు ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్‌రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని  సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్‌లో మార్బుల్‌ను అమర్చారు.