SATHEE Portal: ఐఐటీ ఖరగ్‌పుర్‌తో కలిసి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సాథీ (Self Assessment Test and Help for Entrance Exams) అనే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా జేఈఈ, నీట్‌ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తోంది. పోటీ పరీక్షల సన్నద్ధతను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడే ఈ వేదిక గురించి అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలను కోరుతూ లేఖలు రాసింది. డిసెంబర్‌ 12 నాటికి దేశ వ్యాప్తంగా 60 వేల మందికి పైగా విద్యార్థులు సాథీలో రిజిస్టరైనట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డా. సుభాష్‌ సర్కార్‌ లోక్‌సభలో వెల్లడించారు. 


ఈ పోర్టల్‌లో జేఈఈకి 45 రోజులు, నీట్‌కు 60 రోజుల క్రాష్‌ కోర్సులతో పాటు మాక్‌ టెస్ట్‌లు, ప్రాక్టీస్‌ క్వశ్చన్లు, వీడియో లెక్చర్స్‌, వెబినార్‌లు అందుబాటులో ఉన్నాయి. జేఈఈ, ఇతర ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సహకరించేలా 45 రోజుల క్రాష్‌ కోర్సును ఇటీవల ప్రారంభించింది. ఐఐటీ టాపర్లు, విద్యావేత్తలు, సబ్జెక్టు నిపుణులతో ఈ వేదిక ద్వారా శిక్షణ ఇస్తోంది.


ఇంగ్లిష్‌తో పాటు మొత్తం అయిదు భాషల్లో ఈ కోర్సు అందుబాటులో ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. అఖిలభారత సాంకేతిక విద్యా మండలి (AICTE) దీని కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) ఆధారిత ట్రాన్స్‌లేషన్‌ టూల్‌ను అభివృద్ధి చేయగా.. ఇది 22 భారతీయ భాషల్లో పనిచేస్తుంది. ఈ టూల్‌ గురించి, దాని వినియోగంపై పలు విద్యా సంస్థలు/ కళాశాలల్లో వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. 


WEBSITE


➥ ఈ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి సెషన్‌, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు జనవరి సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నవంబరు 1న విడుదల చేసింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12న ఫలితాలను విడుదల చేస్తారు.


➥ జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో  ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.


➥ నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2023 పరీక్ష తేదీలను డిసెంబరు చివరివారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసే అవకాశం ఉంది. నీట్ యూజీ-2022 ప్రకటన వెలువడిన తర్వార అధికారిక వెబ్‌సైట్‌లో నీట్ పరీక్ష తేదీలతోపాటు పరీక్ష సిలబస్, అప్లికేషన్ ఫామ్, ఇన్‌ఫర్మేషన్ బులిటన్, పరీక్ష పూర్తి స్వరూపం గురించి అందుబాటులో ఉంచనున్నారు. వచ్చే ఏడాది మే నెలలో నీట్ యూజీ-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..