Karnataka: కష్టాలను తట్టుకోలేక, చిన్నచిన్న సమస్యలకే యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, ఉద్యోగం రాలేదని, ప్రమోషన్ రాలేదని ఇలా చిన్నచిన్న కారణాలతో ప్రాణాలనే వదిలేస్తున్నారు. తాజాగా  జుట్టు రాలిపోతుందనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని మైసూర్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.


ఇదీ జరిగింది


కావ్యశ్రీ (21) మైసూర్‌లోని రాఘవేంద్ర ఎక్స్‌టెన్షన్‌లో ఉంటుంది. ఆమె కొద్ది రోజులుగా హెయిర్ ఫాల్​​ సమస్యతో బాధపడుతోంది. అయితే ఎంత మంది వైద్యులను కలిసినా, ఎన్ని విధాల చికిత్స తీసుకున్నా ఫలితం లేదు. దీంతో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయింది కావ్య.


క్రమక్రమంగా జుట్టు మొత్తం ఊడిపోయింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.


లేటైందని


మరోవైపు షోరూమ్ నిర్వాహకులు కారు డెలివరీ చేయలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. 


కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామానికి చెందిన తెలగాపురం కృష్ణ (21) కారు కొనుక్కొని స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఎల్లారెడ్డిలోని ఓ కారు షోరూమ్ లో కారు కొనుగోలుకు సంప్రదించాడు. అయితే షోరూమ్ నిర్వాహకులు కారు ధర రూ.8.71 లక్షలని, రూ.2.5 లక్షల డౌన్​ పేమెంట్ చెల్లించాలని ముందుగా చెప్పారు. కృష్ణ మే 23న రూ.50 వేలు చెల్లించగా, మిగిలిన రూ.2 లక్షలు చెల్లించి కారు తీసుకెళ్లాలని షోరూమ్ నిర్వాహకులు సూచించారు. కృష్ణ రూ.2 లక్షలు తీసుకుని శనివారం షోరూమ్ ​కు వెళ్లాడు. 


నిరుత్సాహంతో 


అయితే షోరూమ్ నిర్వాహకులు రూ.2 లక్షలను కట్టించుకుని మరో రూ.50 వేలు చెల్లించాలని కోరారు. కారు డెలివరీ ఇవ్వడానికి సమయం పడుతుందన్నారు. దీంతో కారు  తీసుకోడానికి  షోరూమ్ కు వెళ్లిన కృష్ణకు నిరాశే ఎదురైంది. కారు డెలవరీ ఆలస్యం అవుతుందన్న నిర్వాహకుల మాటలతో నిరాశ చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు యువకుడు. షోరూమ్​ నిర్వాహకులు తనను మోసం చేశారని ఆదివారం తన ఇంట్లో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Also Read: Denmark Shooting: షాపింగ్‌మాల్‌లో కాల్పుల మోత- ముగ్గురు మృతి


Also Read: Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!