Japan PM Enjoys Pani Puri: మన దేశంలో ఫేమ‌స్ స్ట్రీట్ ఫుడ్‌ను అతిథిగా వ‌చ్చిన ఓ ప్ర‌ముఖుడికి తినిపించ‌గా ఆయ‌న ఆ రుచికి ఫిదా అవ‌డ‌మే కాకుండా మ‌రొక‌టి కావాల‌ని అడిగి వేయించుకున్నారు. అంతేకాదు మ్యాంగో జ్యూస్‌, ల‌స్సీ తాగారు. ఇదేంటి ఇవ‌న్నీ మామూలుగా తినేవే క‌దా అంటారా.. ఆ తిన్న వ్య‌క్తి.. ఆఫ‌ర్ చేసిన వ్య‌క్తి ఎవ‌రో తెలిస్తే అవాక్క‌వుతారు.


మోదీతో కలిసి పానీపూరీ రుచి చేస్తున్న‌ జపాన్ ప్రధాని


పానీ పూరి అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఒక‌టో రెండో తినేసి ఆపేద్దామనుకున్నా.. ఒక‌ పట్టు పట్టనిదే తిన్నట్టుగా ఉండదు. ఇది అందరికి తెలిసిన విషయమే అయినా.. దేశాధినేత అయినా పానీపూరీ రుచికి దాసోహం అవ్వాల్సిందేన‌ని రుజువైంది. మన ప్రధాని న‌రేంద్ర‌ మోదీ …జపాన్ ప్రధాని ప్యూమియో కిషిదా సరదాగా పానీ పూరీ రుచి చేశారు. కిషిదాకి మన పానీ పూరి టేస్ట్ చాలా నచ్చినట్టు ఉంది.. అందుకే మరి మరి అడిగి ఇంకొకటి వేయించుకున్నారు. 


భారత్‌, జపాన్‌ మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించేందుకు రెండు దేశాల ప్రధానులు రాష్ట్రపతి భవన్ వెనక ఉన్న సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని బుద్ధ జయంతి పార్క్‌లో కాసేపు విహ‌రించారు. పార్క్‌లోని గౌత‌మ‌ బుద్దుని ప్రతిమకు వారిద్ద‌రూ నివాళులర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన‌ ఫుడ్‌ స్టాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి మ‌న దేశ‌ అల్పాహార వంటకాలను, పానీయాలను రుచిచూశారు. ఆ త‌ర్వాత‌ కవ్వంతో మజ్జిక చిలికారు. ఆ తర్వాత కిషిదకు.. మోదీ పానీపూరీ గురించి చెప్పి దాని రుచి చూపించారు.






మన దేశపు వీధుల్లో బాగా ఫేమస్ అయిన పానీపూరీని ఇద్దరు నేతలు తిన్నారు. అయితే రెండు పానీపూరీలు తిన్న కిషిదా మరొకటి అడిగి వేయించుకున్నారు. ఫ్రైడ్ ఇడ్లీ తినడంతో పాటు మామిడిపండు జ్యూస్ , లస్సీ తాగారు. ఆ తర్వాత కాసేపు అక్కడే ఉన్న బెంచ్ పై కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకొంటూ చాయ్ తాగారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ప్రధాని మోదీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.  "నా స్నేహితుడు గోల్‌గ‌ప్పాల‌తో పాటు భారతీయ స్నాక్స్‌ను ఆస్వాదించారు" అని మోదీ ట్వీట్ చేశారు.






కిషిదా ప్రధాని మోదీతో కలిసి పానీ పూరీని ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్ప‌టికే 14.9 మిలియన్ నెటిజ‌న్లు దీనిని వీక్షించారు. 2.8 మిలియన్లకు పైగా లైక్ చేశారు. "సుఖీ పాప్డీ కూడా తినండి" అంటూ ఓ నెటిజ‌న్‌ చమత్కరించగా... "మోదీజీ నాకూ పానీ పూరీ అంటే ఇష్టం, నా ప్లేటు ఎక్కడ" అని మరొకరు వ్యాఖ్యానించారు.


కాగా.. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ ప్రధానమంత్రి ప్యుమియో కిషిదా సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. భారత్ -జపాన్ మధ్య అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బ‌లోపేతం చేసేందుకు ఇద్దరు ప్రధానులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. వీటితో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, సుస్థిర , స్వేచ్చాయుత వాతావరణం ఉండేలా …ద్వైపాక్షిక చర్చలు సాగించినట్లు ఇద్దరు నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా జపాన్‌ ప్రధాని కిషిదకు మ‌న‌ ప్రధాని ప్రత్యేక కానుకలను అందించారు. గంధం చెక్కపై చెక్కిన బుద్ధుని ప్రతిమను బహూకరించారు. బాల్‌బోధి మొక్కను కూడా ఆయ‌న‌కు కానుకగా అంద‌జేశారు.