డ్రగ్స్‌ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోంది. సుఖ్ పాల్ అరెస్టు I.N.D.I.A. కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షాల కూటమి ఏర్పాటయినప్పటి ఆప్‌, కాంగ్రెస్ మధ్య ఉన్న విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతల ప్రకటనపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతల జోక్యంతో...ఈ వివాదంలో ముగిసిపోయింది. మ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా అరెస్టుతో ఇండియా కూటమిలో విభేదాలు వస్తాయని ప్రత్యర్థులతో పాటు విశ్లేషకులు భావించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆప్ మధ్య కచ్చితంగా రాజుకుంటుందని, అది తమకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు లెక్కలు వేసుకున్నారు. 


ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా


డ్రగ్స్‌ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరాను గురువారం పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చండీగఢ్‌లోని ఆయన నివాసంలో  సోదాలు నిర్వహించిన తర్వాత,  ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద గతంలో నమోదైన కేసులో జలాలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఫజిల్కాలోని జలాలాబాద్‌ కోర్టు ఆయనకు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా అరెస్టుతో కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఈ పరిణామాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ అభివర్ణించింది. పంజాబ్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రాజా నేతృత్వంలోని నేతల బృందం గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ను కలిసి ఎమ్మెల్యే అరెస్టుపై ఫిర్యాదు చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో ఖైరా హస్తం ఉన్నందునే కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారని అధికార ఆప్‌ నేతలు తెలిపారు. 


కూటమిలోనే కొనసాగుతామన్న కేజ్రీవాల్
ఎమ్మెల్యే అరెస్టుతో I.N.D.I.A. కూటమికి బీటలు వారతాయన్న అందరూ ఊహించారు. అయితే ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ క్లారిటీ ఇచ్చారు. ఇండియా కూటమి విషయంలో పూర్తి నిబద్ధతతో ఉన్నామన్నారు. కూటమికి దూరంగా వేరే దారిలో వెళ్లబోమని, డ్రగ్స్ కేసులో పంజాబ్‌ పోలీసులు కాంగ్రెస్ నేతను అరెస్టు చేసినట్లు తెలిసిందన్నారు. భగవంత్‌ సింగ్ మాన్‌ ప్రభుత్వం మాత్రం నిబద్ధతతో పని చేస్తోందని, ఆప్‌ ప్రభుత్వం డ్రగ్స్‌ సమస్యను ముగించే లక్ష్యంతో ఉందన్నారు. ఈ పోరాటంలో ఆప్ ప్రభుత్వం ఎవరినీ విడిచిపెట్టదని స్పష్టం చేశారు. 


పంజాబ్ లో 7వేల కోట్లకు పైగా డ్రగ్స్ వ్యాపారం
దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా డ్రగ్స్ విక్రయాలు జరిగేది పంజాబ్ లోనే. అఖిల భారత వైద్య విజ్నాన సంస్థ అంచనాల ప్రకారం పంజాబ్ లో ఏటా సుమారు రూ.7500 కోట్ల విలువైన డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. అందులో హెరాయిన్ వాటా రూ.6,500 కోట్ల వరకు ఉంటుంది. రైతులు మొదలు చిరు వ్యాపారులు, బడా వ్యాపార వేత్తల వరకు ప్రతి ఒక్కరూ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఆర్మీలోనూ కొందరు సైనిక జవాన్లు సైతం డ్రగ్స్‌కు బానిసలుగా మారి బలహీనులు అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.