IRCTC Tatkal Rules: దేశంలో ప్రతిరోజూ కోటి మంది వరకు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. వీరిలో చాలా మంది రిజర్వేషన్లు చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా జర్నీ చేయాలనుకుంటారు. . ఎందుకంటే రిజర్వ్ చేసుకున్న కోచ్‌లో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందుకోసం ప్రయాణికులు కొన్ని రోజులు ముందుగానే ప్లాన్ చేసుకుని టిక్కెట్‌ను బుక్ చేసుకుంటారు. ప్రజలు రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి నేరుగా ఆన్‌లైన్‌లో ఇంట్లో కూర్చుని టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అయితే జులై 1 నుంచి ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ రూల్స్ మారుతున్నాయి.

మనం అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకుంటారు. భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌ (Tatkal Ticket Booking)కు సంబంధించి నిబంధనలను మార్చుతోంది. జూలై 1 నుంచి ఇంతకుముందులా ఈ వ్యక్తులు తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకునే అవకాశం ఉండదు. మీరు కూడా ఈ కేటగిరీలో ఉన్నారో లేదో తెలుసుకోవడం బెటర్. 

ఈ వ్యక్తులు తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకోలేరు

రైలులో ప్రయాణించే IRCTC యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే జూలై 1, 2025 నుంచి మీ IRCTC అకౌంట్ నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ మారతాయి. ఏ IRCTC వినియోగదారుల ఖాతాలో ఆధార్ ప్రమాణీకరణ (Authentication) జరగలేదో, వారు తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకోవడానికి వీలుండదు.

IRCTC ద్వారా వినియోగదారులందరికీ ఇమెయిల్ ద్వారా కూడా ఈ సమాచారం అందనుంది. జూలై 1, 2025 నుండి, IRCTC వెబ్‌సైట్ ద్వారానే కాకుండా, మొబైల్ యాప్ ద్వారా కూడా ఆధార్ అథెంటికేషన్ కలిగిన వినియోగదారులు మాత్రమే తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకోగలరు అని రైల్వే శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆధార్ అథెంటికేషన్ ఎలా చేయాలి?

IRCTC నిబంధనలను మార్చిన తర్వాత రైళ్లలో ప్రయాణించే వారిలో కొన్ని డౌట్లు ఉన్నాయి. ఆధార్ అథెంటికేషన్ ఎలా చేస్తారు. IRCTC ద్వారా చేసిన ఇమెయిల్‌లో కూడా దీని గురించి ప్రస్తావించారు. ఈ ప్రమాణీకరణను పూర్తి చేయడానికి, మీరు IRCTC అధికారిక వెబ్‌సైట్ www.irctc.co.in లో లాగిన్ అవ్వాలి. లేదా మీరు IRCTC రైల్ కనెక్ట్ మొబైల్ యాప్‌ను కూడా ఉపయోగించి అథెంటికేషన్ పూర్తి చేయవచ్చు.

వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయిన తర్వాత, మీరు మై అకౌంట్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ మీరు అథెంటికేట్ యూజర్  ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇచ్చిన సూచనలను పాటించాలి. ఆధార్ అథెంటికేషన్ కోసం మీ ఆధార్‌కు మీ మొబైల్ నంబర్ లింక్ చేసి ఉండాలి. లేకపోతే ఓటీపీ లాంటి అలర్ట్ రాదు.  

జులై 15 నుంచి మరిన్ని మార్పులు

రైల్వే మంత్రిత్వ శాఖ టికెట్ బుకింగ్స్ లో మరింత పారదర్శకత, నియంత్రణ కోసం  జూలై 15 నుండి ఆన్‌లైన్‌లో, PRS కౌంటర్లలో లేదా అధీకృత ఏజెంట్ల ద్వారా చేసిన అన్ని తత్కాల్ బుకింగ్‌ల కోసం ఆధార్ OTP ధృవీకరణను తీసుకొచ్చింది. బుకింగ్‌లు ప్రారంభమైన మొదటి 30 నిమిషాల్లో తత్కాల్ టిక్కెట్‌లను రైల్వే ఏజెంట్లు బుక్ చేయడానికి వీలు లేదు.