Aditya L1 Project: ఆదిత్య L1 మిషన్‌‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు రెండు దశలు విజయవంతం అయినట్టు ఇస్రో ప్రకటించింది. లగ్రాంజియన్ పాయింట్‌కి చేరుకున్న తరవాత విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరొనాగ్రాఫ్‌ (VELC) సాయంతో ఆదిత్య L1 అక్కడి నుంచి ఫొటోలు పంపనుంది. రోజుకి 1,440 ఫొటోలు పంపుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ ఫొటోల ద్వారా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ఆదిత్య L1లో అతి పెద్ద పే లోడ్ VELC. ఈ మిషన్ మొత్తంలో ఇదే అత్యంత కీలకం.  


ఈ ప్రయోగం వెనుక చాలా మంది శాస్త్రవేత్తల కృషి ఉంది. ఆదిత్య-ఎల్‌1 ప్రాజెక్టులో ఎంతో కీలకమైన విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరొనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ) పేలోడ్‌ తయారు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ (IIA) శాస్త్రవేత్తలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. బెంగళూరులోని ఐఐఏకు చెందిన సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ సైన్స్‌ టెక్నాలజీ (క్రెస్ట్‌) క్యాంపస్‌లో ఉన్న ఎంజీకే మీనన్‌ ల్యాబోరేటరీలో ప్రత్యేకంగా ‘క్లాస్‌ 10’ క్లీన్‌ రూమ్‌ను రూపొందించారు. గాలికూడా చొరబడలేనంత పకడ్బందీగా తయారు చేశారు. అంతే కాకుండా క్లీన్ రూమ్‌లోకి ప్రవేశించడానికి ఎన్నో ఆంక్షలు విధించారు. ఎంతగా అంటే చివరకు సెంట్ కొట్టుకున్నా అందులోకి ప్రవేశించకుండా నిషేధించారు.


లక్ష రెట్లు శుభ్రంగా క్లీన్ రూమ్
ఆస్పత్రుల్లోని ఐసీయూలతో పోలిస్తే ఈ క్లీన్‌ రూమ్‌ లక్ష రెట్లు శుభ్రంగా ఉంటుంది. క్లీన్‌ రూమ్‌లో ఓ చిన్న కాలుష్య కణం ఉన్నా వీఈఎల్‌సీ తయారీ పనులు ఆగిపోయే ఆస్కారం ఉంటుంది. అప్పటి వరకు శాస్త్రవేత్తలు పడ్డ శ్రమ మొత్తం వృథా అవుతుంది. అందుకని పర్ఫ్యూమ్‌ వాడకాన్ని కూడా నిషేధించారు. చివరకు అందులోకి ప్రవేశించే శాస్త్రవేత్తలు కూడా ప్రత్యేకమైన సూట్లు ధరించి లోపలికి వెళ్లారు. అల్ట్రాసోనిక్‌ క్లీనింగ్‌ ప్రాసెస్‌ పూర్తయ్యాకే శాస్త్రవేత్తలు అందులోకి ప్రవేశించారు.


ఆదిత్య-ఎల్‌1 కక్ష్య పెంపు విజయవంతం
భారత్ తొలిసారి చేపట్టిన సోలార్ మిషన్ Aditya L1. శ్రీహరికోట నుంచి PSLV ద్వారా ఆదిత్య L1 మిషన్‌ని ఇస్రో సెప్టెంబర్ 2వ తేదీన లాంఛ్ చేసింది ఇస్రో. నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది ఈ రాకెట్. సరిగ్గా 11.50 నిముషాలకు రాకెట్ లాంఛ్ అయింది. రెండు దశలు విజయవంతం అయినట్టు ఇస్రో ప్రకటించింది. ఆ తరవాత అన్ని దశలూ దాటుకుని వెళ్లింది ఆదిత్య L1. చివరకు స్పేస్‌క్రాఫ్ట్‌ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయినట్టు వెల్లడించింది. ఆదిత్య L1 తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని తెలిపింది. 


బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి ఆదిత్య-ఎల్‌1 శాటిలైట్‌ కక్ష్య పెంపు ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టారు. ఈ నెల 5న రెండోసారి కక్ష్యను పెంచనున్నట్లు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం శాటిలైట్‌ హెల్తీగా ఉందని, ఆదివారం చేపట్టిన కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలిపింది. ప్రస్తుతం శాటిలైట్‌ 245 x 22,459 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతోందని ఇస్రో ఎక్స్‌ వేదికగా తెలిపింది. సూర్యుడిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడమే ఆదిత్య మిషన్ లక్ష్యం. లగ్రాంజ్ పాయింట్ (Lagrange Point 1) నుంచి సూర్యుడి చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది.