Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో గింగిరాలు తిరుగుతున్న పాకిస్థాన్‌ భారత్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కానీ వాళ్లకు పరాభవం తప్పలేదు. జలంధర్, జమ్మూ, బటిండా, అవంతిపుర, శ్రీనగర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తల వంటి 15 నగరాల్లోని సైనిక స్థావరాలను దాడికి యత్నించి విఫలమైంది. భారతదేశ శక్తిని తట్టుకోలేకోపోయింది. 

భారత్ సైనిక స్థావరాలను టచ్ చేయాలనే ఆలోచన వచ్చిందుకు పాకిస్థాన్‌కు గట్టిగానే ఇండియన్ ఆర్మీ బదులిస్తోంది. పాకిస్థాన్‌ మిసైల్స్‌ బోర్డర్ దాటకుండానే భారత్ ఆర్మీ పేల్చేసింది. అంతే కాదు మన దేశానికి చెందిన ఆర్మీ డ్రోన్స్‌ వెళ్లి పాకిస్థాన్‌లో విధ్వంసం సృష్టించాయి. తమ రక్షణ కోసం చైనా నుంచి దిగుమతి చేసుకున్న వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ HQ9 యూనిట్లను భారత్ నిర్వీర్యం చేసింది. అంతే కాదు పాకిస్తాన్‌లోని పలు నగరాల్లోని సైని స్థావరాలపై దాడులు చేసింది. 

HQ-9 వాయు రక్షణ వ్యవస్థ నాశనం పాకిస్తాన్‌కు చాలా పెద్ద దెబ్బగా భావించవచ్చు. ఈ దాడి రీసౌండ్‌ బీజింగ్ నుంచి ఇస్లామాబాద్ వరకు వినిపిస్తోంది. పాకిస్తాన్‌ సైన్యం HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ యూనిట్లు డ్రోన్ దాడుల్లో తుక్కు తుక్కు అయ్యాయి. లాహోర్, సియాల్‌కోట్, గుజ్రాన్‌వాలా, రావల్పిండి, చక్వాల్, బహవల్పూర్, మియాన్‌వాలి, కరాచీ, చోర్, మియానో, అటోక్‌లలో భారత్ ఆర్మీ డ్రోన్‌లు చొచ్చుకు వెళ్లి విధ్వంసం సృష్టించాయి. కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చాయి.  

రావల్పిండిలో ఉన్న క్రికెట్ స్టేడియంపై కూడా భారత్ డ్రోన్ దాడి చేసి ధ్వంసం చేసింది. అయితే అప్పటికే అక్కడ ఉన్న ఆటగాళ్లను పాకిస్థాన్ తరలించింది. మరోవైపు పాకిస్థాన్‌లో ఉన్న అమెరికా టూరిస్టులు బహిరంగ ప్రదేశాల్లో తిరుగొద్దని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది.  

పాకిస్థాన్‌తో యుద్ధం కోరుకోవడం లేదని మొదటి నుంచి భారత్ చెబుతోంది. తమ దేశంలో విధ్వంసానికి కారణమైన ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేశామని కూడా ప్రపంచానికి తెలియజేసింది. తమ దేశంలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయనే విషయాన్ని అంగీకరించని పాకిస్థాన్‌ ఇలా దాడులు చేస్తోంది. సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ ఇప్పుడు ఏకంగా సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుంది. ఇదే విషయంపై భారత్ విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ మాట్లాడుతూ...  పాకిస్తాన్‌తో జగడం తీవ్రతరం చేయాలనే ఉద్దేశ్యం భారత్‌కు లేదు, కానీ సైనిక దాడులు జరిగితే, దానికి "చాలా" గట్టిగా ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. 

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో జరిగిన సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. "అనాగరికమైన" పహల్గామ్ ఉగ్రవాద దాడి కారణంగా బుధవారం సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేయవలసి వచ్చిందని విదేశాంగ మంత్రి అన్నారు.

"ఈ దాడి మే 7న సరిహద్దు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేయడం ద్వారా ప్రతిస్పందించవలసి వచ్చింది. మా ప్రతిస్పందన చాలా టార్గెటెడ్‌గా జరిగిందని " అని ఆయన అన్నారు.

"పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడం మా ఉద్దేశ్యం కాదు. అయితే, మాపై సైనిక దాడులు జరిగితే, దానికి చాలా దృఢమైన ప్రతిస్పందన ఎదురవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు" అని ఆయన అన్నారు.