Operation Sindoor | భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ దాడుల్లో 100మంది ఉగ్రవాదుల హతం అయ్యారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం గురువారం నాడు తెలిపింది. 

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు పార్లమెంట్​లోని ల్రైబరీ భవనంలో గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ఎస్‌.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అధ్యక్షత వహించగా.. ప్రధాని మోదీ సందేశాన్ని రాజ్‌నాథ్ వినిపించారు.

వంద మంది ఉగ్రవాదులు హతం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాదులకు గట్టిగా బదులిచ్చిందన్నారు రాజ్‌నాథ్.  ఆపరేషన్ సిందూర్​పై రక్షణ మంత్రి రాజ్​నాథ్ రాజకీయ పార్టీలకు వివరిస్తూ.. భారత బలగాలు చేసిన క్షిపణి దాడుల్లో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారని స్పష్టం చేశారు.  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేసిన ఆయన ఉగ్రవాదల ఏరివేతకు ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ఈ సమయంలో మరిన్ని వివరాలు ఇవ్వడం సరికాదని గురువారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. 

అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరన్ రిజిజు మాట్లాడుతూ "ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. నేటి సమావేశానికి హాజరైన అన్ని పార్టీల నేతలు భారత సైన్యాన్ని అభినందించారు, వారి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించాయి. వారు ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా దేశం కోసం కేంద్రం నిర్ణయాలకు మద్దతు తెలిపారు. ఉగ్రవాదం అంశంపై అందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు దేశం మొత్తం కలిసి ఉందన్నారు.’

అన్ని పార్టీల నేతలు రాజకీయాలు చేయకుండా.. దేశాన్ని కాపాడేందుకు, జాతీయ సమగ్రత కోసం దోహదపడాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, ఉగ్రవాదంపై వారికి ఎలాంటి పరిమితులు లేవని స్పష్టం చేశారు.

9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసంభారత సైన్యం కేవలం 25 నిమిషాల ఆపరేషన్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 21 గుర్తించిన ఉగ్రవాద శిబిరాల్లో 9 టార్గెట్ చేసి పూర్తిగా ధ్వంసం చేసింది. వైమానిక దాడులు, క్షిపణి దాడులతో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాం. మరో 12 ఉగ్రవాద శిబిరాలు మిగిలి ఉన్నాయి. త్వరలోనే వాటిపై భారత సైన్యం మరోసారి ఆపరేషన్ సిందూర్ చేపడుతుందని చెప్పారు.   మూడు సాయుధ దళాలు అత్యంత సమన్వయంతో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసిన దాడి ఆపరేషన్ సిందూర్ అని పేర్కొన్నారు

పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. కొన్నిచోట్ల సరిహద్దు ప్రాంతాల్లో చొరబాటుకు యత్నిస్తుండగా.. భారత సైన్యం వారి ప్రయత్నాలను తిప్పి కొడుతోందని రాజ్ నాథ్ అన్నారు. మరోవైపు భారత్ సరిహద్దు వెంట భద్రత పెంచింది. పాక్ నుంచి వచ్చే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్ యాక్టివేట్ చేశారు.