PM Modi Speech: దేశంలో రాజకీయ సుస్థిరత వల్ల కలిగే ప్రయోజనాలను భారత్ ఇప్పటికే ప్రపంచానికి చాటిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ సుస్థిరత వల్ల అభివృద్ధిలో వేగం, నిర్ణయాధికారంలో దేశం శక్తివంతం అవుతుందని చెప్పారు. రాజకీయ సుస్థిరత ఉండడం అనేది దేశ గౌరవ మర్యాదలను కూడా పెంచుతుందని అభిప్రాయపడ్డారు. మన దేశానికి వచ్చే 25 ఏళ్ల కాలం అమృత కాలంమని, అది చాలా ముఖ్యమని మోదీ చెప్పారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు.


వచ్చే 25 ఏళ్లు కీలకం అయినందున రాబోయే ఈ కాలం పంచ ప్రాణాలు పెట్టి అభివృద్ధి కోసం పని చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఆనాడు స్వాతంత్య్ర సమరయోధుల కలలు కన్న ఆశలను ఈ కాలంలోనే సాకారం చేయాలని చెప్పారు. అందుకోసం సంపూర్ణ అభివృద్ధి మన ముందు ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ అని చెప్పారు. మనలో ఇంకా ఏ మూలైనా బానిస మనస్తత్వం దాగి ఉంటే దాన్ని పూర్తిగా పారద్రోలాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలని అన్నారు. 


పంచప్రాణాలు ఇవే..
ఆ పంచప్రాణాలు (Panchpran) ఏంటో మోదీ వివరించారు. 1. వికసిత భారతం, 2. బానిసత్వ నిర్మూలన, 3. వారసత్వం, 4. ఏకత్వం, 5. పౌర బాధ్యత ఇవే మన పంచ ప్రాణాలు అని మోదీ చెప్పారు. ఇవి పాటిస్తూ మనం మన లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. ‘‘భారతదేశం ఒక ఆకాంక్షాపూరిత సమాజం (Aspirational Society), భారతదేశ ప్రజలు సానుకూల మార్పులను కోరుకుంటున్నారు. దానికి సహకరించాలని కూడా కోరుకుంటున్నారు. ప్రతి ప్రభుత్వం ఈ ఆకాంక్షాపూరిత సమాజం (Aspirational Society) కోసం పని చేయాల’’ని ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.


‘‘ఈ 75 ఏళ్ల ప్రయాణంలో, ఆశలు, ఆకాంక్షలు, ఎత్తులు, పల్లాల మధ్య అందరి కృషితో మనం చేరగలిగిన చోటికి చేరుకున్నాము. 2014లో, పౌరులు నాకు బాధ్యతను అప్పగించారు- స్వాతంత్య్రం తర్వాత జన్మించిన మొదటి వ్యక్తి ఎర్రకోట నుండి ఈ దేశ పౌరులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాన్ని అందుకున్నాడు’’ అని ప్రధాని మోదీ ప్రసంగించారు.


ఈ నేల ప్రత్యేకం అని వారికి తెలియదు - మోదీ
‘‘స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడేటప్పుడు గిరిజన సమాజాన్ని మర్చిపోలేం. భగవాన్ బిర్సా ముండా, సిద్ధూ-కణ్హు, అల్లూరి సీతారామ రాజు, గోవింద్ గురు - స్వాతంత్య్ర పోరాటానికి గొంతుకగా నిలిచారు. గిరిజన సమాజాన్ని మాతృభూమి కోసం జీవించడానికి, చనిపోయేందుకు సిద్ధమైన అనేక మంది ఉన్నారు. మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన అభివృద్ధి పథాన్ని శంకించే అనేక మంది సంశయవాదులు ఉన్నారు. కానీ, ఈ దేశంలోని ప్రజల గురించి వేరే విషయం ఉందని వారికి తెలియదు. ఈ నేల ప్రత్యేకమైనదని వారికి తెలియదు’’


వారి ముందు తలవంచండి - మోదీ
‘‘భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది. 75 ఏళ్ల ప్రయాణంలో భారత్‌కు అమూల్యమైన సామర్థ్యం ఉందని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని భారత్ నిరూపించుకుంది. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారైనా, దేశాన్ని నిర్మించిన వారైన - డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ జీ, సర్దార్ పటేల్, ఎస్పీ ముఖర్జీ, ఎల్బీ శాస్త్రి, దీనదయాళ్ ఉపాధ్యాయ, జేపీ నారాయణ్, ఆర్‌ఎం లోహియా, వినోబా భావే, నానాజీ దేశ్‌ముఖ్, సుబ్రమణ్య భారతి - అటువంటి గొప్ప వ్యక్తుల ముందు తలవంచండి’’ అని ప్రధాని అన్నారు.