Nirmala Sitharaman: దేశంలో టామాటా ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో విపక్షాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధరల నియంత్రణకు కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ధరలు తగ్గించడం కోసం నేపాల్ నుంచి టమాటాలను దిగుమతి చేసుకోవడం, సహకార సంఘాలు, ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ద్వారా సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.  


ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రభుత్వం టామాటాలు సేకరిస్తోందని, దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్‌సీసీఎఫ్ సబ్సిడీ ధరలకు దాదాపు 9 లక్షల కిలోల టమాటాలను విక్రయించినట్లు సీతారామన్ తెలిపారు. ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో వినియోగదారులు ONDC ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేయవచ్చన్నారు.


కొన్ని మండీలలో ఇప్పుడు హోల్‌సేల్ ధరలు తక్కువగా ఉన్నాయని, కోలార్ మండి నుంచి కిలో రూ.85 చొప్పున టామాటాలు కొనుగోలు చేశామని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కిలో రూ. 100 లోపు ఉందని, నేపాల్ నుంచి సైతం దిగుమతులు ప్రారంభించామన్నారు. శుక్రవారం నాటికి చాలా వరకు చేరే అవకాశం ఉందన్నారు. ఈ వారాంతంలో ఎన్‌సీసీఎఫ్‌ కిలో రూ.70 చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.


మోదీ ప్రభుత్వం హామీలను అమలు చేస్తూ కలలను సాకారం చేస్తున్నారని అన్నారు. ఫలితంగా మైలేగా టు మిల్ గయాకు, బనేగా టు బన్ గయా,  ఆయేగా టు ఆ గయా అంటూ మార్పులు వచ్చాయన్నారు. పలు సేవలపై ఆమె మాట్లాడుతూ.. బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఇందులో భాగంగా పరివర్తనాత్మక మార్పులను చేపట్టిందన్నారు. ఉచిత బ్యాంకు ఖాతాలు, విద్యుత్ సరఫరా, గ్యాస్ కనెక్షన్లు, చౌకైన మందులు అందిస్తున్నట్లు చెప్పారు.  


గంటపాటు ఏకధాటి ప్రసంగం
యూపీఏ దశాబ్ద కాలాన్ని వృథా చేసిందన్నారు. సంక్షోభంలోకి నెట్టివేసిందన్నారు. కానీ ఇప్పుడు ప్రతి సంక్షోభం ఇప్పుడు సంస్కరణలుగా మారిపోయిందని చెప్పారు. యుపీఏ హాయాంలో తక్కువ వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం ఉండేదని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఎక్కువ వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణాన్ని చూస్తున్నామంటూ ప్రసంగించారు. దాదాపు గంటపాటు ఇంగ్లీష్, హిందీ  తమిళంలో మాట్లాడారు. UPI విజయవంతమైందని, భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సింగపూర్, యుఏఈ, ఫ్రాన్స్ యూఎస్, కెనడా, యూకే దేశాలను ఆకర్శించిందన్నారు.


అందుకే టమాటా ధరలు పెరిగాయి
భారీగా పెరిగిన టమాటా ధరలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గత వారం ఎంపీ కళానిధి వీరస్వామి ప్రశ్నించారు. ఎంపీ ప్రశ్నపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో  భారీ వానలతో టమాటా పంట దెబ్బతిన్నదని, అందుకే ధరలు పెరిగాయని చెప్పారు. పంట సీజన్ మార్పు, కర్ణాటక కోలార్ జిల్లాలో టమాటా పంటకు వైట్ ఫ్లై తెగులు రావడంతో దిగుబడి తగ్గిందన్నారు. డిమాండ్ పెరడం, ఉత్పత్తి తగినంత లేకపోవడంతో ధరలు పెరిగాయన్నారు.