Illegal Mining Scam:: గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు వ్యవహారంలో విచారణ రోజువారి జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తనకు ఇచ్చిన బెయిల్ షరతులు సడలించి బళ్లారి వెళ్లేందుకు అనుమతించాలని గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. సొంత ప్రదేశాన్ని వీడి ఇప్పటికే 15 సంవత్సరాలు గడిచిందని..బళ్లారిలో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ప్రత్యేక కోర్టులో విచారణ ఆలస్యం అవుతోందని గతేడాది ఆగస్టులో బెయిల్ ఇచ్చిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానం విధించిన షరతులు ఎక్కడా ఉల్లంఘించలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. 


బెయిల్ ఇస్తే సాక్షులపై తీవ్ర ప్రభావం.. 


స్పందించిన జస్టిస్ ఎంఆర్ షా.. దీనికి గాలి జనార్దన్ రెడ్డి కారణం కాదా ఆయన ప్రమేయం లేదా అని ప్రశ్నించారు. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ షరతులు సడలించవద్దని సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ దివాన్ కోర్డును ఆభ్యర్థించారు. ఇప్పటికే  ఇచ్చిన బెయిల్ ని ఆసరా చేసుకొని సాక్షులపై తీవ్ర ప్రభావం చూపుతున్నారని, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో ఏమాత్రం కనికరం చూపినా కేసుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ప్రత్యేక కోర్టులో, హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా కేసు ఆలస్యానికి కారణం అయ్యారని పేర్కన్నారు. కేసు విచారణ చేపట్టిన న్యాయాధికారులను ప్రభావితం చేయాలని చూశారని.. ఓ న్యాయాధికారి అనుమానాస్పదంగా మరణించారని కోర్టు దృష్టికి తెచ్చారు. బెయిల్ ఇస్తే వీళ్లు ఎలా ఉంటారో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే అని ధర్మాసనం ముందు మాధవి దివాన్ వాదనలు వినిపించారు.


మనమరాలు నిజంగానే పుట్టిందో లేదో తెలుసుకోండి?


మధ్యలో కల్పించుకున్న గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాది అవసరం అయితే బళ్లారిలో గాలి నివాసం వద్ద తగినంత బందోబస్తు పెట్టుకోవచ్చన్నారు. అందుకు కూడా సీబీఐ అంగీకరించలేదు. గాలి జనార్దన్ రెడ్డికి మనవరాలు పుట్టిందని, శిశువును చూసేందుకు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు రెండు నెలల సమయం ఇవ్వాలని మీనాక్షి అరోరా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీబీఐ తరఫు న్యాయవాది ఇప్పుడు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని షరతులు మార్చుకోవద్దని కోరారు. దీనిపై స్పందించిన గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాది కనీసం నాలుగు వారాలైనా ఇవ్వాలని విన్నవించారు. ఇందుకు స్పందించి ధర్మాసనం గాలి జనార్దన్ రెడ్డికి మనమరాలు పుట్టిందో లేదో కునుక్కోవాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వుల కోసం విచారణను ఈరోజుకి వాయిదా వేసింది.