Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్- పోటీ నుంచి డిగ్గీ ఔట్

ABP Desam   |  Murali Krishna   |  30 Sep 2022 12:32 PM (IST)

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్ ఇచ్చారు నేతలు. దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్- పోటీ నుంచి డిగ్గీ ఔట్

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ వేసే వరకు ఎవరు రేసులో ఉన్నారనే దానిపై స్పష్టత వచ్చేటట్లు కనిపించడం లేదు. ఎందుకంటే నిన్నటి వరకు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారని ప్రచారం జరిగింది. శుక్రవారం ఉదయం మల్లికార్జున ఖర్గే కూడా నామినేషన్ వేస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా దిగ్విజయ్ సింగ్ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు దిగ్విజయ్‌ సింగ్‌ జబల్‌పుర్‌లో మీడియాతో మాట్లాడారు.

ఖర్గే జీ నా కంటే సీనియర్. నేను నిన్న ఆయన నివాసానికి వెళ్లాను. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు మీరు నామినేషన్ వేస్తే నేను రేసు నుంచి తప్పుకుంటానని ఖర్గేకు చెప్పాను. ఆ తర్వాత ఆయనే అభ్యర్థి అని పత్రికల ద్వారా తెలుసుకున్నాను. కనుక నేను ఖర్గేకు మద్దతు ఇస్తున్నాను. ఆయనపై పోటీ గురించి కూడా నేను ఆలోచించలేను. -                   దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ నేత

కాంగ్రెస్‌తోనే

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సి రావడంతో నిరాశ చెందారా అని మీడియా వేసిన ప్రశ్నకు దిగ్విజయ్ ఇలా సమాధానమిచ్చారు.

నా జీవితమంతా కాంగ్రెస్‌ కోసమే పనిచేశాను. పని చేస్తూనే ఉంటాను. దళితులు, గిరిజనులు, పేదల పక్షాన నిలబడడం, మత సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోరాడడం, కాంగ్రెస్, నెహ్రూ-గాంధీ కుటుంబానికి నమ్మకంగా ఉండటం అనే 3 విషయాల్లో నేను రాజీపడను                             - దిగ్విజయ సింగ్, కాంగ్రెస్ నేత 

థరూర్ X ఖర్గే

మొన్నటి వరకూ కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ప్రధానంగా రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌ పేరు వినిపించింది. పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఆయన కూడా చెప్పారు. అయితే ఉన్నట్టుండి ఆయన అధిష్ఠానానికి ఎదురు తిరగటం వల్ల రేసులో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తరవాత దిగ్విజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికవుతారని అంతా అనుకున్నారు. శశి థరూర్ పోటీలో ఉన్నప్పటికీ...దిగ్విజయ్‌ సింగ్‌కే అధ్యక్ష పదవి దక్కుతుందని ఫిక్స్ అయ్యారు. కానీ సడెన్‌గా మల్లికార్జున ఖర్గే పేరు తెరపైకి వచ్చింది.

మల్లికార్జున్ ఖర్గే పేరు తెరపైకి రావడంతో దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఖర్గే ఎప్పటి నుంచో కాంగ్రెస్‌కు విధేయుడిగా ఉన్నారు. ఇప్పటి వరకూ శశి థరూర్ వర్సెస్ దిగ్విజయ్‌గా ఉన్న పోరు ఇప్పుడు థరూర్ vs ఖర్గేగా మారింది.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు ఖర్గే, థరూర్ నామినేషన్ వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ రాత్రికి రాత్రి ఖర్గేతో మాట్లాడారు. నామినేషన్ వేయాలని అధిష్ఠానం అడుగుతోందని ఆయనకు వివరించారు. అదిష్ఠానం మాటను శిరసావహించిన ఖర్గే రేసులోకి దిగారు.

Also Read: RBI Repo Rate Hike: సామాన్యుడిపై వడ్డీల పిడుగు- మరోసారి రెపో రేటు పెంపు!

Also Read: Viral Video: పీక నొక్కుతూ, జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ- విద్యార్థిపై టీచర్ ప్రతాపం!

Published at: 30 Sep 2022 12:23 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.