Goa nightclub Fire Accident | ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలోని నైట్ క్లబ్‌లో శనివారం (డిసెంబర్ 6) అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. అర్పోరాలో ఉన్న ‘బర్చ్‌ బై రోమియో లేన్‌’ నైట్‌ క్లబ్‌లో సిలిండర్ పేలిన ఘటనలో 25 మంది సిబ్బంది మృతిచెందారు. ఈ ఘటనపై గోవా పోలీసు చీఫ్ అలోక్ కుమార్ మాట్లాడుతూ, సిలిండర్ పేలడం వల్లే మంటలు చెలరేగాయని తెలిపారు. ఏఎన్ఐ నివేదిక ప్రకారం, "కనీసం 25 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిలో క్లబ్ సిబ్బంది ఉన్నారు" అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. మృతదేహాలను గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. చనిపోయిన వారిలో కిచెన్ సిబ్బంది అధికంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ సిలిండర్ పేలుడు ఘటనపై స్పందించారు. సిలిండర్ పేలుడు తరువాత కొందరు మంటల్లో చిక్కుకుని మరణించగా, మరికొందరు ఊపిరాడక చనిపోయారని తెలిపారు. క్లబ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 20 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని సమాచారం.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఎం ప్రమోద్ సావంత్..

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అన్నారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అధికారులను సీఎం సావంత్ ఆదేశించారు. భద్రతా ప్రమాణాలలో నిర్లక్ష్యం ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరణించిన వారిలో ముగ్గురు లేదా నలుగురు పర్యాటకులు కూడా ఉన్నారు. వారు గోవాకు హాలిడే ట్రిప్ కోసం వచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు.

 అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ 

అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు చేపట్టాయి. పొగ, ఎగిసిపడుతున్న మంటలు రెస్క్యూకు పెద్ద ఆటంకంగా మారాయి. అయితే డజన్ల కొద్దీ ప్రజలను సకాలంలో సకాలంలో బయటకు తీసుకురాగలిగారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి రాత్రంతా పట్టిందని, ఇప్పుడు అన్ని నైట్ క్లబ్‌లలో అగ్ని భద్రతపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తామని స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు. తద్వారా ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడవచ్చు అన్నారు.

భద్రతా లోపాలను గుర్తు చేస్తున్న పాత ప్రమాదాలు

భారతదేశంలో అగ్నిప్రమాదాలు తరచుగా భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లనే జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు దీనికి నిదర్శనం. హైదరాబాద్‌లో మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదంలో 17 మంది మరణించగా, కోల్‌కతాలోని ఒక హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు, గుజరాత్‌లోని ఒక వినోద ఉద్యానవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది మరణించారు.