Gaganyaan Mission:భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి గగన్ యాన్ మిషన్ మొదటి పరీక్షను ఉదయం 8 గంటలకు నిర్వహించాలని భావించారు. అయితే సాంకేతిక కారణాలతో కౌంట్‌డౌన్‌ను అరగంట పొడిగించారు. అంటే అరగంట ఆలస్యంతో ప్రయోగం ప్రారంభంకానుంది. 


తొలి 'ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ -1' (టీవీ-డీ1)లో 'క్రూ ఎస్కేప్ సిస్టం' (సీఈఎస్ ) పరీక్షించనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో మరిన్ని మానవ రహిత మిషన్లు, ఇతర పరీక్షలు నిర్వహించగలుగుతుంది. ఈ విధంగా తొలి గగన్ యాన్ మిషన్ దిశగా అడుగులు వేయనున్నారు.


అంతరిక్షంలో భూమి దిగువ కక్ష్యలోకి మనుషులను పంపడమే గగన్ యాన్ మిషన్ ఉద్దేశం. భూ ఉపరితలం నుంచి దీని దూరం 400 కిలోమీటర్లు. ఈ మిషన్ ద్వారా భారత్ తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపి సురక్షితంగా తిరిగి తీసుకురానుంది. భారత్ గగన్ యాన్ మిషన్ ను 2025లో ప్రారంభించనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనుషులను అంతరిక్షంలోకి పంపితే ఎలాంటి అవాంతరాలు ఉండవని అర్థమయ్యేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రాజెక్టుల్లో ఒకటి.


వ్యోమగాములను తక్కువ భూ కక్ష్యకు చేర్చడానికి భారత్ ఎల్వీఎం3 రాకెట్‌ను ఉపయోగించనుంది. ఘన, ద్రవ, క్రయోజనిక్ దశలను కలిగి ఉన్న రాకెట్ ఇది. ఉదయం నుంచి ఇస్రో తన తొలి ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇస్రో అధికారిక వెబ్సైట్, యూట్యూబ్, ఫేస్బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఇస్రో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జాతీయ బ్రాడ్ కాస్టర్ దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 


చంద్రయాన్-3 మిషన్ ద్వారా భారత్ ఇప్పటికే విజయవంతమైన ప్రయోగంతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు తన ఫోకస్‌ను సూర్యుడిపై పెట్టింది. ఇలా ఒక్కో ప్రయోగంతో అంతరిక్షంలో పట్టు పెంచుకుంటుంది. స్పేస్ స్టేషన్‌ను కూడా నిర్మించాలని భారత్ భావిస్తోంది.