దేశ రాజధానిలోని సాకేత్ కోర్టు కాంప్లెక్స్ లో శుక్రవారం జరిగిన నాలుగు రౌండ్ల కాల్పుల్లో న్యూ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ఓ మహిళ గాయపడింది. కాల్పుల శబ్ధం విన్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాంగ్మూలం ఇచ్చేందుకు ఆ మహిళ ఈ రోజు కోర్టుకు వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె ఒక కేసులో సాక్షి. ఈ సమయంలో ఆమెపై కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.


ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఆవరణలో శుక్రవారం కోర్టు ప్రొసీడింగ్స్‌ ప్రారంభం కాగానే కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పులు ప్రారంభం కాగానే ప్రజలు భయంతో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. 


లాయర్ల డ్రెస్‌లో దుండగులు సాకేత్ కోర్టుకు వచ్చారని చెబుతున్నారు. మహిళను గుర్తు పట్టగానే ఆమె వద్దకు వచ్చి దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


అక్కడే ఆమెతో ఉన్న వ్యక్తులు పోలీసుల సహాయంతో యువతిని చికిత్స నిమిత్తం ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. కాల్పుల ఘటనలో గాయపడిన మహిళ కోర్టు ఆవరణ నుంచి స్వయంగా బయటకు వస్తున్న వీడియోలో ఉంది. బులెట్ గాయం కారణంగా బాధపడుతున్నట్టు కూడా ఆ వీడియోలో ఉంది.