Sanatan Dharma Row:


సనాతన ధర్మంపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు..


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సనాతన ధర్మం వివాదంపై స్పందించారు. డీఎమ్‌కే, I.N.D.I.A కూటమి హిందువులకు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని విమర్శించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్‌పైనా మండి పడ్డారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించినా..విమర్శలు మాత్రం ఆగడం లేదు. కూటమిలోనే కొన్ని పార్టీలు ఉదయనిధి చేసిన కామెంట్స్‌ని వ్యతిరేకించాయని అన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకించడం తప్ప DMKకి ఓ అజెండా ఏమీ లేదని అన్నారు. తమిళనాడు ప్రజలు ఆ పార్టీ పాలనతో విసిగిపోయారని, కేవలం భాషాపరమైన అడ్డంకుల కారణంగానే దేశ ప్రజలకు అది అర్థం కావడం లేదని వెల్లడించారు. 


"తమిళనాడు ప్రజలు DMK పాలనతో విసిగిపోయారు. తమిళ భాష కారణంగానే మిగతా రాష్ట్రాల ప్రజలకు అక్కడి సమస్యలు అర్థం కావడం లేదు. భాషే అడ్డంకిగా మారింది. చాన్నాళ్ల పాటు ఇదే కొనసాగింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఏ భాషలో నుంచైనా క్షణాల్లో అనువాదం చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఇప్పుడిప్పుడే దేశ ప్రజలకు తమిళనాడు ప్రజల కష్టాలు అర్థమవుతున్నాయి"


- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి 


ఢిల్లీ డిక్లరేషన్‌పై సంతృప్తి..


ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు నిర్మలా సీతారామన్. ఇదే సమయంలో G20 సదస్సు గురించీ ప్రస్తావించారు. సమష్టి కృషితోనే ఈ సమ్మిట్‌ విజయవంతంగా పూర్తైందని స్పష్టం చేశారు. IMF సహా ప్రపంచ బ్యాంక్‌లో తీసుకురావాల్సిన సంస్కరణలపైనా చర్చలు జరిగాయని వెల్లడించారు. ఢిల్లీ డిక్లరేషన్‌పై పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు.


మధ్యప్రదేశ్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆ తరవాత భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా I.N.D.I.A కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ కూటమికి లీడర్ లేడని సెటైర్లు వేశారు. ఓ వైపు భారత దేశం ప్రపంచ దేశాలను ఏకంచేసే సామర్థ్యాన్ని సంపాదించుకుంటోందని, మరో వైపు మాత్రం ఓ దళం దేశాన్ని విడగొట్టాలని చూస్తోందని మండి పడ్డారు. ఇలాంటి వాళ్లంతా కలిసి ఓ కూటమి పెట్టుకున్నారని, భారతదేశ సంస్కృతిపై దాడి చేయడమే వీళ్ల అజెండా అని తేల్చి చెప్పారు. సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలన్నదే వాళ్ల కుట్ర అని మండి పడ్డారు. 


ఈ ఘమండియా కూటమి ఎలా పని చేయాలన్నది ఆ భేటీలో నిర్ణయించుకున్నారు. ఓ రహస్య అజెండాని కూడా తయారు చేసుకున్నారు. భారత దేశ సంస్కృతిపై దాడి చేయడమే వీళ్ల అజెండా. సనాతన ధర్మాన్ని ముక్కలు చేయడమే వీళ్ల లక్ష్యం.ఇవాళ బహిరంగంగానే కొందరు సనాతన ధర్మంపై మాటల దాడి చేస్తున్నారు. రేపు మనపైనా దాడులు చేస్తుండొచ్చు. సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని మనం కచ్చితంగా కట్టడి చేయాలి" "


- ప్రధాని నరేంద్ర మోదీ 


Also Read: తొలిసారి మహిళా అర్చకులను నియమించిన తమిళనాడు, సనాతన ధర్మానికి కౌంటర్‌?