Fact Check: 


ఫ్యాక్ట్ చెక్..


యూపీలోని ప్రైవేట్ మెడికల్ డెంటల్, మెడికల్ కాలేజీల్లో SC, ST, OBC కోటాల ద్వారా ప్రవేశాన్ని రద్దు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వాట్సాప్‌లలో ఈ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. కేవలం మెరిట్ ప్రాతిపదికనే ప్రవేశాలుంటాయన్నది ఆ మెసేజ్‌లోని సారాంశం. అయితే...దీనిపై ప్రభుత్వం తరపున ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందుకే...ఇది నిజమా కాదా అన్న అనుమానం కలుగుతోంది. ఇంత పెద్ద నిర్ణయాన్ని ప్రచారం లేకుండానే తీసుకుంటారా అన్నది ఆలోచించాల్సిన విషయం. నిజమా కాదా అని ఫ్యాక్ట్ చెక్ చేయగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిజానికి ఇప్పుడే కాదు. 2017 నుంచి ఈ ప్రచారం జరుగుతోంది. కౌన్సిలింగ్ జరిగిన ప్రతిసారీ ఇదే మెసేజ్ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఈ సారి కూడా అదే జరుగుతోంది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని తేలింది. గతంలోనే దీనిపై ఫ్యాక్ట్‌చెక్‌లు జరిగినా ఇంకా ఈ మెసేజ్‌లు ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాయి. 2017లోనూ చాలా మంది సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌లు పెట్టారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..అప్పట్లో కొన్ని మీడియా సంస్థలు కూడా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఇదే పోస్ట్‌లు పెట్టాయి. అయితే..అప్పటికే ఫ్యాక్ట్ చెక్ చేసిన కొందరు..ఇదంతా ఫేక్ అని కామెంట్స్‌ పెట్టారు. ఆ తరవాత ఆ పోస్ట్‌లను డిలీట్ చేశాయి మీడియా సంస్థలు. బడాబడా మీడియా సంస్థలు కూడా ఇది నిజమే అని పొరపడ్డాయి. ఆ తరవాత తప్పు తెలుసుకుని సారీ చెప్పాయి. ఇంతకీ సోషల్ మీడియాలో తిరుగుతున్న మెసేజ్ ఏంటంటే..?


"ఇకపై ఉత్తరప్రదేశ్ లో ప్రైవేట్ డెంటల్ & మెడికల్ కాలేజీల్లో యెస్.సి/యెస్.టి/ఒ.బి.సి కోటా ల ద్వారా ప్రవేశం రద్దు... కేవలం మెరిట్ మాత్రమే ప్రాతిపదిక.... సబ్జక్ట్ మీద పట్టుకోసం ప్రభుత్వం తరపునుంచి ఉచిత కోచింగ్ ఉంటుంది... రిజర్వేషన్లు ఉండవు...... ఒక విప్లవాత్మకమైన ముందడుగు... అత్యంత సాహసోపేతమైన నిర్ణయం.... కూసింత ఓటుబ్యాంక్ కోసం మతాలమధ్య కులాల మధ్య చిచ్చు పెడుతున్న సందర్భంలో అద్భుతమైన సమాజంకోసం ఒక సాహసికుడు కంటున్న స్వప్నం... నేను మనఃస్పూర్తిగా సమర్దిస్తున్నా... ఇది ఎటువంటి అడ్డంకులూ లేకుండా దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ."


పాలసీలో మార్పుల్లేవ్..


ఫ్యాక్ట్‌ చెక్‌లో తేలిందేంటంటే...ప్రస్తుతం రిజర్వేషన్‌ల విషయంలో 2006 నాటి పాలసీయే యూపీలో కొనసాగుతోంది. ఈ విధానం ప్రకారం..అసలు యూపీలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్‌లు లేవు. ఈ పాలసీలో ఎలాంటి మార్పులు కూడా జరగలేదు. అంటే...ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న పోస్ట్ ముమ్మాటికీ నిజం కాదు. 2021లో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. యోగి ఆదిత్యనాథ్ సీఎం కాకముందు నుంచే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్‌లు లేవు. ఇలా ఫేక్ మెసేజ్‌లు వాట్సాప్‌లలో ఇలా సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. వచ్చే ప్రతిదీ నిజమే అనుకుని చాలా మంది ఫార్వర్డ్ చేస్తుంటారు. ఈ కారణంగా...అనవసరంగా వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఫ్యాక్ట్‌చెక్‌లు చేసి ఇది తప్పు అని చెబుతున్నా...ఈ వాట్సాప్ యూనివర్సిటీలో మాత్రం ఇలాంటివి వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. 


Also Read: రాజస్థాన్‌ అసెంబ్లీలో సొంత ప్రభుత్వంపైనే మంత్రి విమర్శలు, పదవి నుంచి తొలగించిన సీఎం