Air India Flight Urine Case: విమాన ప్రయాణాలలో మహిళా ప్రయాణికులపై జరుగుతున్న ఘటనలు ఎయిరిండియాను చిక్కుల్లో పడేస్తున్నాయి. మహిళా ప్రయాణికురాలిపై యూరినేట్ చేయడం, తోటి ప్రయాణికురాలిని ఇబ్బంది పెట్టిన రెండు వేర్వేరు ఘటనలపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) ఎయిరిండియాకు షోకాజు నోటీసులు జారీ చేసింది. రెండు వేర్వేరు ఘటనల్లో తాము నివేదిక కోరేంత వరకు తమకు ఎయిరిండియా ఎందుకు రిపోర్ట్ చేయలేదని డీజీసీఏ ప్రశ్నించింది. విమాన సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని, ఎయిర్ లైన్స్ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులలో పేర్కొంది. 


ఎయిరిండియాకు వివరణ ఇచ్చేందుకు రెండు వారాలు గడువు ఇచ్చిన డీజీసీఏ, ఎయిరిండియా నివేదిక తరువాత చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. విమనాలలో ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు వాటిని విమానయాన సంస్థలు విమానయాన నియంత్రణ సంస్థకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఘటన జరిగిన రోజు డీజీసీఏకు విషయం చెప్పాలి, కానీ విమానయాన సంస్థ ఆ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంది, ప్రయాణికులకు ఏ న్యాయం చేసిందో డీజీసీఏకు తెలియజేయాలి. కానీ ఘటనలు జరిగి రోజులు గడుస్తున్నా తమకు వివరాలు తెలపకపోవడం, బాధ్యులైన ప్రయాణికులపై తీసుకున్న చర్యల వివరాలను సైతం వెల్లడించకపోవడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. 


ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మహిళపై యూరినేట్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ పోలీసులు బెంగళూరులో శంకర్ శేఖర్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు.  గతేడాది నవంబర్ 26న ఈ ఘటన జరగ్గా...అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు...ఎట్టకేలకు బెంగళూరులో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. బెంగళూరులో
ఉన్నాడన్న ప్రాథమిక సమాచారం ఆధారంగా...ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఓ టీమ్‌ని అక్కడికి పంపించారు. ఫోన్ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నప్పటికీ..సోషల్ మీడియా అకౌంట్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. వీటి ద్వారానే పోలీసులు నిందితుడిని ట్రాక్ చేశారు. ఒకే ప్లేస్‌లో ఉండటంతో పాటు క్రెడిట్ కార్డ్‌ కూడా వినియోగించినట్టు విచారణలో తేలింది. నిజానికి...శంకర్ శేఖర్ శర్మ బాధితురాలితో మాట్లాడాడు. పరిహారం కింద రూ.15,000 కూడా చెల్లించాడు. కంప్లెయింట్ వెనక్కి తీసుకోవాలని కోరాడు. అయితే...బాధితురాలి కూతురు మాత్రం ఇది అంగీకరించలేదు. డబ్బు తిరిగి ఇచ్చేసింది. అప్పటి నుంచి మళ్లీ కేసు మొదటికి వచ్చింది. అమెరికాలోని వెల్స్‌ఫార్గో కంపెనీలో పని చేస్తున్న శంకర్ శర్మను ఆ సంస్థ విధుల నుంచి తొలగించింది. ఇలా ప్రవర్తించే వారికి తమ కంపెనీలో చోటు ఇవ్వలేమని,క్రెడిబిలిటీ కోల్పోలేమని స్పష్టం చేసింది యాజమాన్యం. 


ఇదీ జరిగింది..
డిసెంబర్ 28న ఎయిర్ ఇండియా సంస్థ తమకు ఈ విషయం చెప్పిందని, ఆ తరవాత బాధితురాలని సంప్రదించి మరిన్ని వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో నిందితుడి పేరు శంకర్ శేఖర్ మిశ్రా అని తేలింది. ముంబయికి చెందిన ఈ బిజినెస్‌మేన్‌ ఎక్కడ ఉంటాడోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. "బాధితురాలి ఫిర్యాదు మేరకు పబ్లిక్‌ ప్లేస్‌లో అనుచితంగా  ప్రవర్తించి నందుకు ఐపీసీ సెక్షన్ 510, మహిళా గౌరవాన్ని భంగ పరిచినందుకు సెక్షన్ 509, అవమాన పరిచినందుకు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. అయితే...ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో ఉన్న సిబ్బందినీ విచారిస్తున్నారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం 50 ఏళ్ల శేఖర్ మిశ్రా...బిజినెస్‌క్లాస్‌లో ప్రయాణిస్తున్నాడు. మద్యం మత్తులో ఉన్నాడు. టాయ్‌లెట్‌ కోసం అని లేచి ముందుకు వెళ్లాడు. అయితే... వాష్‌రూమ్ వరకూ వెళ్లాననుకుని ఆ మత్తులోనే ఓ మహిళపై యూరినేట్ చేశాడు. ఇది జరిగిన వెంటనే సిబ్బందికి ఫిర్యాదు చేశానని, కానీ వాళ్లు స్పందించలేదని ఆరోపిస్తున్నారు బాధితురాలు. "లంచ్ టైమ్ తరవాత ఫ్లైట్‌లో లైట్స్ ఆఫ్ చేశారు. అప్పుడే ఓ ప్యాసింజర్ నా సీట్‌ దగ్గరకు వచ్చాడు. నాపై యూరినేట్ చేయడం మొదలు పెట్టాడు" అని టాటా గ్రూప్ ఛైర్మన్‌కు రాసిన లేఖలో తెలిపారు బాధితురాలు.