Delhi Floods: ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నది - ఆందోళనలో దిల్లీ వాసులు

Delhi Floods: ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Continues below advertisement

Delhi Floods: ఉత్తర భారతదేశం మొత్తాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. గత మూడు రోజులుగా విస్తృతమైన కురుస్తున్న వర్షాలతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. దాదాపు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో గత సాయంత్రం నుంచి 205.33 మీటర్ల ప్రమాదకర మార్కును అధిగమించిన యమునా, ఈ ఉదయం 206.32కి చేరుకుంది - హర్యానా హత్నికుండ్ బ్యారేజీ నుంచి నదిలోకి ఎక్కువ నీటిని విడుదల చేయడంతో ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీకి వరదలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం 3 గంటల నాటికి ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం 206.28 మీటర్లుగా ఉంది. ఊహించిన దానికంటే ముందుగానే నది ప్రమాద స్థాయిని అధిగమించిందని అధికారులు తెలిపారు. హర్యానా ఈరోజు ఎక్కువ నీటిని విడుదల చేయడంతో రానున్న 24 గంటల్లో యమునా నది మరింత ఉద్దృతంగా ప్రవహిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Continues below advertisement

1978లో ఈ నది ఆల్ టైమ్ రికార్డ్ నీటి స్థాయి 207.49 మీటర్లు. ఇది యమునా నదికి "అధిక వరద" స్థాయి. అయితే ప్రస్తుతం 206 మీటర్లు దాటడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు. వారిని నగరంలోని పలు ప్రాంతాల్లోని సహాయక శిబిరాలు, కమ్యూనిటీ సెంటర్లకు తరలించనున్నారు. వరద ముంపు ప్రాంతాలను, యమునా నది నీటిమట్టాన్ని పర్యవేక్షించడానికి ఢిల్లీ ప్రభుత్వం 16 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించడానికి అనేక చర్యలను ప్రకటించారు. ఈక్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఇంత భారీ వర్షాలు కురువడం 40 ఏళ్లలో ఇదే తొలిసారి అని అన్నారు. 1982లో 24 గంటల వ్యవధిలో 169 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో చివరిసారిగా ఇంత వర్షం కురిసిందన్నారు. భారీ వర్షాలు కురవడం, నగరంలో డ్రైనేజీ వ్యవస్థ దానికి తట్టుకునే స్థాయిలో లేకపోవడం బాధాకరం అన్నారు. మరోవైపు యమునా నది ఉద్ధృతితో పాత రైల్వే బ్రిడ్జిపై రైల్వే వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గింది. రెండు శతాబ్ది, ఒక వందే భారత్ రైలు సహా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 14 రైళ్లను దారి మళ్లించారు. 

హిమాచల్ ప్రదేశ్, జమ్మకశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో మరింత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. భారీ వర్షం దాదాపు ఉత్తర భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రభావిత రాష్ట్రాల్లో సహాయక, రెస్క్యూ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఈ ప్రాంతంలో అనేక నదులు ఉప్పొంగుతున్నాయి. నగరాలు, పట్టణాలలో, చాలా రోడ్లు, భవనాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా రోడ్లన్నీ నాశనం అయ్యాయి. అలాగే కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు కోట్ల విలువైన ఇళ్లు ఆస్తులను దెబ్బతిన్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి సుఖ్‌ విందర్ సింగ్ సుఖుతో మాట్లాడి, అతనికి అన్ని సహాయాలు, మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో అనేక రోడ్లు, హైవేలు మూసుకుపోయాయి. నదుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటిందని తెలుస్తోంది. రాజస్థాన్, పంజాబ్, హర్యానాలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోతున్నాయి. పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాలకు అధికారులు సహాయక చర్యలు అందిస్తున్నారు. రాజస్థాన్‌లో తీవ్రమైన వర్షం సాధారణ జీవితాన్ని స్తంభింపజేసింది. రోడ్లు, రైలు ట్రాక్‌లు, ఆసుపత్రులను కూడా వరదలు ముంచెత్తాయి. ఈరోజు రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ భంగం, రుతుపవనాల సంగమం తీవ్రమైన స్పెల్‌కు దారితీసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Continues below advertisement