Delhi Pollution: 


కృత్రిమ వర్షాలు..


ఢిల్లీలో కాలుష్య తీవ్రతను (Delhi Air Pollution) తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు చేపడుతోంది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. కృత్రిమ వర్షాన్ని సృష్టించి కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలని చూస్తోంది. నవంబర్ 20-21 తేదీల్లో ఆర్టిఫిషియల్ రెయిన్‌ (Delhi Artificial Rain) సృష్టించాలని భావిస్తోంది. ఇప్పటికీ అక్కడి గాలి నాణ్యత (Delhi Air Quality) ఏ మాత్రం మెరుగవలేదు. పైగా రోజురోజుకీ మరింత దిగజారిపోతోంది. పైగా పొరుగు రాష్ట్రాల్లో రైతులు వరి గడ్డిని పెద్ద ఎత్తున (Stubble Burning) కాల్చుతున్నారు. ఫలితంగా పొగ కమ్ముకుంటోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, ఆర్థిక మంత్రి అతిశి ఐఐటీ కాన్పూర్‌ ( IIT Kanpur) టీమ్‌తో సమావేశమయ్యారు. ఆ టీమ్‌ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. కృత్రిమ వర్షం సృష్టిస్తే కొంత వరకూ ఫలితం ఉండే అవకాశముందని సూచించారు. దీనిపై పూర్తిస్థాయిలో ఓ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఈ రిపోర్ట్‌ వచ్చిన తరవాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఆ నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యానికి సంబంధించి పలు పిటిషన్‌లు విచారణలో ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే నివేదికకు సుప్రీంకోర్టు ఆమోదం ఇస్తే..వెంటనే ఆ చర్యల్ని అమలు చేస్తుంది ఆప్ సర్కార్. 


"IIT కాన్పూర్‌ టీమ్‌తో ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరిగింది. ఇప్పటికిప్పుడు పొల్యూషన్‌ని కంట్రోల్ చేయాలంటే కృత్రిమ వర్షం సృష్టించాలని వాళ్లు సూచించారు. అందుకోసం కనీసం 40% మేర మేఘాల్ని మథించాల్సి ఉంటుంది. నవంబర్ 20-21 మధ్యలో ఇలా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం. సుప్రీంకోర్టు అందుకు ఆమోదం తెలిపితే పైలట్ స్టడీ కింద ఈ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగానే ఉన్నాం. ఐఐటీ కాన్పూర్ టీమ్‌ దీనిపై ఓ రిపోర్ట్ ఇవ్వనుంది. ఆ తరవాత ఆ రిపోర్ట్‌ని సుప్రీంకోర్టు ముందు ఉంచుతాం. కోర్టు ఆమోదిస్తే కేంద్ర ప్రభుత్వం సాయంతో చర్యలు చేపడతాం"


- గోపాల్ రాయ్, ఢిల్లీ పర్యావరణ మంత్రి 


స్కూల్స్‌కి వింటర్ బ్రేక్


ఇప్పటికే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని స్కూల్స్‌కి వింటర్ బ్రేక్ (Winter Break in Delhi) ప్రకటించింది. నవంబర్ 9-18 వరకూ స్కూల్స్‌ని మూసివేయనుంది. దాదాపు ఆరు రోజులుగా కాలుష్య స్థాయి ఏ మాత్రం తగ్గకపోగా పెరుగుతూ వస్తోంది. మరి కొద్ది రోజుల పాటు కూడా కాలుష్య స్థాయిలో తగ్గదని చెబుతున్నారు అధికారులు. అందుకే వింటర్ బ్రేక్‌ కింద సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌ (Gopal Rai), విద్యాశాఖ మంత్రి అతిశి, రవాణా మంత్రి కైలాశ్ గహ్లోట్‌తో పాటు మరి కొందరు కీలక అధికారులు సమావేశమయ్యారు. ఈ  భేటీ తరవాతే సెలవులు ప్రకటించారు. సాధారణంగా ఢిల్లీలో వింటర్ బ్రేక్ డిసెంబర్-జనవరి మధ్యలో ఉంటుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటారు. కానీ...ఈ సారి కాలుష్యం కమ్మేయడం వల్ల ముందుగానే సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. 


Also Read: నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఆగ్రహం,అందుకే మోదీ బెస్ట్ లీడర్ అంటూ ప్రశంసలు