ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్(DCW Chief) స్వాతి మలివాల్‌(Swati Maliwal)ను కారు డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు. మద్యం మత్తులో కారు నడుపుతున్న ఆ వ్యక్తి తన కారు ఎక్కాలని బలవంతం చేశాడు. దానికి ఆమె ఆయనతో వాదనకు దిగారు. ఈ వాదన సాగుతుండగానే.. ఆమె చెయ్యి కారు విండోలో ఉండగానే అద్దాన్ని పైకి వేస్తూ వాహనాన్ని ముందుకు లాగించేశాడు. ఈ క్రమంలో కారుతోపాటు స్వాతిని ఈడ్చుకుంటూ వెళ్లి పోయాడు. 


ఢిల్లీలోని ఎయిమ్స్ గేటు నెంబర్ 2 వద్దే ఈ ఘటన జరిగింది. సుమారు 10 నుంచి 15 మీటర్ల దూరం స్వాతిని ఈడ్చుకెళ్లాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ హరిశ్చంద్రను అరెస్టు చేశారు. 


తెల్లవారుజామున 3.11 గంటలకు ఈ ఘటన జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎయిమ్స్ గేటు నెంబర్ 2 ముందు తన వాహనం కోసం ఎదురు చూస్తున్న స్వాతి మలివాల్ ను తన వాహనంలో కూర్చోమని కారు డ్రైవర్ కోరాడు. మలివాల్ అతన్ని మందలిస్తున్న సమయంలో కారు డ్రైవర్ హరిశ్చంద్ర కారు అద్దాలను పైకి లేపాడు. దీంతో స్వాతి మలివాల్ చేయి కారులో ఇరుక్కుపోయింది. దీంతో కారు డ్రైవర్ 10 నుంచి 15 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు.






హరిశ్చంద్ర (47) మద్యం మత్తులో ఉన్నాడని, అతడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడికి, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వాతి మలివాల్ తన బృందంతో కలిసి ఫుట్ పాత్ పై నిల్చున్న సమయంలో ఈ ఘటన జరిగింది.


గరుడ 1 (దక్షిణ ఢిల్లీలో ప్రత్యేక పెట్రోలింగ్ వాహనం) ద్వారా తెల్లవారుజామున 3.10 గంటలకు కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చింది. పెట్రోలింగ్ వాహనం కోట్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిమ్స్ గేట్ నంబర్ 2 ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌పై తెల్లవారుజామున 3.05 గంటలకు మహిళను కారు డ్రైవర్ ఇబ్బంది పెట్టారని ఆ ఫోన్ సమాచారం. బెలెనో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మద్యం మత్తులో మహిళను ఇబ్బంది పట్టారు. తనతో పాటు కారులో కూర్చోమని అడిగాడని, వెంటనే వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.


కారు డ్రైవర్‌ మరోసారి తిరిగి వచ్చి ఆమెను కారులో కూర్చోమని అడిగాడు. ఆమె నిరాకరించి ఈసారి మందలించింది. కిటికీలోంచి అతన్ని పట్టుకొని చెడామడా తిట్టేసింది. అతన్ని పట్టుకోవడానికి యత్నించింది. అంతే డ్రైవర్ వేగంగా కిటికీని పైకి లేపి, వాహనాన్ని స్టార్ట్ చేశాడు. ఆమె చెయ్యి కిటికీలో ఉండిపోయిన సంగతి కూడా చూసుకొని లాక్కొని వెళ్లిపోయాడు. ఆమెను 10-15 మీటర్లు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.


జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 20 ఏళ్ల అంజలి సింగ్‌ను ఇలానే కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసింది. ఆ కంఝవాలా కేసు ఇంకా విచారణ నడుస్తుండగానే ఇంతలో స్వాతి కేసు వెలుగులోకి వచ్చింది.