Goods Train Derails In Odisha's Rayagada: ఇటీవల ఘోర రైలు ప్రమాదం జరిగిన ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. రాయగడ జిల్లా అంబడోలా సమీపంలో శనివారం గూడ్స్ రైలు నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ నెల తొలి వారంలో ఘోర రైలు విషాదం తరువాత ఒడిశాలోనే మరోచోట రైలు ప్రమాదం జరిగింది. తాజాగా గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వరుస రైలు ప్రమాదాలతో అధికారులతో పాటు ప్రయాణికులు సైతం ఆందోళన చెందుతున్నారు.


కలహండిలోని అంబడోలా నుండి లాంజిగఢ్‌ లోని వేదాంత ప్లాంట్‌కు వెళ్తుండగా గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గూడ్స్ రైలు ప్రత్యేక ట్రాక్‌పై పట్టాలు తప్పినందున రైలు సర్వీసులకు ఎలాంటి ఆటంకం కలగలేదు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిచారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.


రెండు వారాల కిందట మూడు రైళ్ల ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిహార్‌కు చెందిన ఓ ప్రయాణికుడు చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి CB మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో మరణాల సంఖ్య 291 కి పెరిగింది. బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా రోషన్‌పూర్‌కు చెందిన సాహిల్ మన్సూర్ (32)గా చనిపోయిన ప్రయాణికుడిగా గుర్తించారు. ట్రామా కేర్ ఐసియులో చికిత్స పొందిన సాహిల్.. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. అతనికి డయాలసిస్ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. చివరగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో పేషెంట్ మరణించాడని SCB మెడికల్ కాలేజీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాన్సు శేఖర్ మిశ్రా తెలిపారు. గాయాలతో పాటు అంతకుముందే అనారోగ్య సమస్యలతో అతడు కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయాడని చెప్పారు.


SCB మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన 205 మందిలో 46 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరిలో 13 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారని పేర్కొన్నారు. ఇద్దరు, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని పత్రా గ్రామానికి చెందిన ప్రకాష్ రామ్ (22) అనే వలస కార్మికుడు శుక్రవారం ఇదే ఆసుపత్రిలో మరణించాడు.


జూన్ తొలివారం ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో 291 మంది మృతి చెందగా, 1,100 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొదట కోల్ కతా నుంచి చెన్నైకి వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి గూడ్స్ రైలు ఉన్న లూప్ లోకి వెళ్లి ఢీకొంది. నాలుగైదు బోగీలు పట్టాలు తప్పాయి. మరికొద్ది సేపటికే యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ ఈ రైలును ఢీకొనడంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఈ విషాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోగా, మరికొన్ని కుటుంబాలు చనిపోయిన వారి డెడ్ బాడీని సైతం గుర్తించలేకపోవడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన ప్రయాణికుల కుటుంబసభ్యులకు పరిహారం ప్రకటించాయి.