Cheetah Death: మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో శుక్రవారం మరో చిరుత మృతి చెందింది. గత నాలుగు నెలల్లో ఇలా చీతా చనిపోవడం ఇది 8వ సారి అని కునో నేషనల్ పార్కు అధికారులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున నేషనల్ పార్కులో ఆఫ్రికన్ చిరుత సూరజ్ చనిపోయి కనిపించింది. ఈ చిరుత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని చెప్పారు. దీంతో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలలో మరణించిన వాటి సంఖ్య 8కి చేరిందని అధికారులు తెలిపారు. గత మంగళవారం కునో పార్కులో తేజస్ అనే ఓ మగ చిరుత చనిపోయిన విషయం తెలిసిందే. మూడ్రోజులు కూడా తిరక్కముందే మరో చిరుత మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. గత మంగళవారం చనిపోయిన తేజస్ చిరుత మెడపై మానిటరింగ్ టీమ్ గాయాలను గుర్తించింది. ఆ టీమ్ చిరుత తేజస్ కు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. చికిత్స పొందుతూ మగ చిరుతపులి తేజస్ ప్రాణాలు విడిచింది. అంతకుముందు కొన్ని గంటలపాటు అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. 


తాజాగా చనిపోయిన సూరజ్ చిరుతతో కలిపి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్‌లో మొత్తం 5 చిరుతలు, 3 చిరుత పిల్లలు మరణించాయి. దక్షిణాఫ్రికా నుంచి దేశానికి తీసుకొచ్చిన చిరుతలలో ఈ సూరజ్ చిరుత కూడా ఉంది. మంగళవారం తేజస్ అనే మగ చిరుత చనిపోవడానికి ముందు.. మే నెలలో చిరుతలు చనిపోయాయి. మే 25న కునో పార్క్‌లో 2 చిరుత పిల్లలు చనిపోయాయి. రెండ్రోజుల క్రితం మగ చిరుత, ఇప్పుడు ఆడ చిరుత చనిపోవడంతో ఆఫ్రికా దేశాల నుంచి దేశానికి తరలించిన వాటిలో చనిపోయిన చిరుతల సంఖ్య 8కు చేరింది. అనారోగ్య, ప్రతికూల వాతావరణం సహా ఇతర కారణాలతో ఆడ, మగ కలిపి ఐదు పెద్ద చిరుతలు, మూడు చిరుత పిల్లలు చనిపోయాయి.


Also Read: Time Management: ఈ టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉంటే, అన్ని పనులు సకాలంలో చక్కబెట్టుకోవచ్చు


మార్చి 27న తొలి చిరుత మృతి..


నమీబియా నుంచి భారత్ కు తరలించిన చిరుతపులలో తొలి చిరుత మార్చి 27న చనిపోయింది. నమీబియా నుంచి తరలించిన చిరుతల్లో ఒకటైన సాషా ఆడ చిరుత కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రాణాలు విడిచింది. నమీబియాలో ఉన్న సమయంలోనే సాషా అనారోగ్యంతో ఉందని అధికారులు భావిస్తున్నారు. అనంతరం దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మగ చిరుత ఉదయ్ ఏప్రిల్ 13న మరణించింది. కార్డియోపల్మోనరీ ఫెయిల్యూర్ కారణంగా ఉదయ్ అనే చిరుత చనిపోయినట్లు జూ సిబ్బంది వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మరో చిరుత దక్ష్ గాయాల కారణంగా మే 9న చనిపోయింది. ప్రతికూల వాతారణ పరిస్థితులు, అనారోగ్య సమస్యలతో చిరుతలు వరుసగా చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆఫ్రికా నుంచి భారత్ కు తరలించినప్పుడే వీటిలో కొన్ని భారత్ లో పరిస్థితులు తట్టుకోలేక చనిపోయే అవకాశం ఉందని భావించామని అక్కడి ఉన్నతాధికారులు గతంలో ఓ ప్రకటనలో తెలిపారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial