Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధనలు సాగిస్తోంది. ఈ మేరకు విక్రమ్ ల్యాండర్ కు ఎప్పటికప్పుడు తన పరిశోధన ఫలితాలను పంపిస్తోంది. అక్కడి నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు డేటాను సేకరిస్తున్నారు. ఈ వీడియోలను ఎప్పటికప్పుడు ఇస్రో తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియా యూజర్లతో పంచుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా మరో వీడియోను షేర్ చేసింది ఇస్రో. చంద్రుని ఉపరితలంపై తిరగాడుతున్న ప్రజ్ఞాన్ రోవర్.. తన పరిశోధనా విధుల్లో భాగంగా చక్కర్లు కొడుతోంది.


తాజాగా రోవర్ శివశక్తి పాయింట్ వద్ద తిరగాడుతున్న దృశ్యాలు ఇస్రో షేర్ చేసిన వీడియోలో చూడవచ్చు. కాగా.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రాంతానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శివశక్తి స్థల్ గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో శాస్త్రవేత్తలను కలిసి అభినందించిన ప్రధాని మోదీ.. ల్యాండింగ్ పాయింట్ కు శివశక్తి స్థల్ గా నామకరణం చేశారు. 


భారతీయులను గర్వపడేలా చేసిన ఆగస్టు 23వ తేదీని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు. బ్రిక్స్ శిఖారాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లి తిరిగి వచ్చిన ప్రధాని.. ఈరోజు బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ లో శాస్త్రవేత్తలను కలిసి స్వయంగా అభినందించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత అంతరిక్షణ పరిశోధనా సంస్థ - ఇస్రో చరిత్ర సృష్టించిన ఆగస్టు 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంతరిక్షణ దినోత్సవం (నేషనల్ స్పేస్ డే)గా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే.. చంద్రయాన్-3కి చెందిన విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రాంతాన్ని శివశక్తిగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే చంద్రుడిపై చంద్రయాన్-2 జ్ఞాపకాలను వదిలి వెళ్లిన ప్రాంతాన్ని తిరంగాగా నామకరణం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. 






Also Read: Working-Age Populations: 2030 నాటికి భారత్‌లో భారీగా వర్కింగ్ ఏజ్ పాపులేషన్‌, మెకిన్సే నివేదిక ఏం చెప్పిందంటే?


దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని మోదీ.. ఈ రోజు ఉదయం నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు. హాల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రదాని.. ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి అభినందించడానికి నన్ను నేను ఆపుకోలేక నేరుగా బెంగళూరు వచ్చానని మోదీ అన్నారు. భారతదేశానికి ఇది సరికొత్త వేకువ అని ప్రధాని మోదీ కొనియాడారు. జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అని నినదించి ఉత్సాహపరిచారు. హాల్ విమానాశ్రయం నుంచి రోడ్ షోగా ఇస్రో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ చంద్రయాన్-3 మిషన్ లో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను కలిసి అభినందించారు.


తొలుత చంద్రయాన్-3 బృందంతో ప్రధాని ఫోటోలు దిగారు. అనంతరం.. చంద్రయాన్-3 ప్రయోగంలో చేపట్టిన దశల గురించి ప్రధానికి ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడారు. భారత్ సత్తా ఏంటో ఈ రోజు ఇస్రో ప్రపంచానికి చూపించింది అని మోదీ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషికి, నిబద్ధతకు సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు.