Centre’s New Bill: 



లిస్ట్‌లో బిల్లు..


కేంద్ర ప్రభుత్వం సంచలన బిల్‌ని ప్రవేశపెట్టనుంది. ఎన్నికల అధికారులను నియమించే ప్యానెల్ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని  (CJI) తప్పించడమే ఈ బిల్ ఉద్దేశం. ఈ మేరకు రాజ్యసభలో బిల్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల సంఘంలోని అత్యున్నత అధికారులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉండేలా బిల్‌లో మార్పులు చేసింది. రాష్ట్రపతి నేతృత్వంలోనే ఓ ప్యానెల్ ఏర్పాటు కానుంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఓ కేంద్రమంత్రి ఉంటారు. అయితే...ఈ బిల్‌ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉండడంపైనే రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌లు, ఎలక్షన్ కమిషనర్లను నియమించే అధికారంపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రధాని, లోక్‌సభ ప్రతిపక్ష నేత, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కూడిన ప్యానెల్ సూచనల మేరకే ఆయా అధికారుల నియామకం జరగాలని తేల్చి చెప్పింది. కానీ...ఇప్పుడు కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులో CJI ని తొలగించడం వివాదాస్పదమవుతోంది. ఈ కొత్త బిల్ ప్రకారం...ప్రధాని సూచనల మేరకు ఐదుగురు సభ్యులు ప్యానెల్‌లో ఉంటారు. వారిలో క్యాబినెట్ సెక్రటరీతో పాటు మరో ఇద్దరు సెక్రటరీలుంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కి సెక్రటరీ హోదా ఇవ్వాలని ప్రతిపాదించింది ఈ బిల్లు. ఇప్పటికే న్యాయవ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్ మరింత దూరం పెంచే అవకాశాలున్నాయి. 


ప్రతిపక్షాల విమర్శలు..


ఈ బిల్‌పై ఇప్పటికే ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపైనే నమ్మకం లేదని విమర్శిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఆప్ దీనిపై స్పందించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిందే కేజ్రీవాల్ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. మోదీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని మండి పడ్డారు. 


"నేను ఇప్పటికే చెప్పాను. ప్రధాని నరేంద్ర మోదీకి సుప్రీంకోర్టుపైనా నమ్మకం లేదని. ఇప్పుడు చాలా స్పష్టంగా ఆయన వైఖరేంటో అర్థమైంది. సుప్రీంకోర్టు ఇచ్చే ఏ తీర్పూ ఆయనకు నచ్చదు. ఆ తీర్పునకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టం చేసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. మోదీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారు"


- అరవింద్ కేజ్రీవాల్