CBSE class 10 Results | కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు 10వ తరగతి రెండవ బోర్డు పరీక్ష (CBSE Board Exam Results 2026) ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన 6.8 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఫలితాలు వచ్చేశాయి. సీబీఎస్ఈ బోర్డు ఫలితాల ప్రకటనతో పాటు స్కోర్కార్డ్ డౌన్లోడ్ చేసుకునే లింక్ను యాక్టివేట్ చేసింది. పదో తరగతి పరీక్షలకు హాజరైన సీబీఎస్ఈ విద్యార్థులు తమ ఫలితాలను https://results.digilocker.gov.in/cbse10thfinalresjul26X.html ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
కొత్త విద్యా విధానం కింద రెండు పరీక్షలు
CBSE శనివారం, జూలై 18, 2026న 10వ తరగతి రెండవ బోర్డు పరీక్ష ఫలితాలను ప్రకటించింది. కొత్త విద్యా విధానం 2020 కింద, ఈ సంవత్సరం తొలిసారిగా విద్యార్థులకు ఒకే విద్యా సంవత్సరంలో రెండుసార్లు బోర్డు పరీక్షలు రాసే అవకాశం కల్పించింది. సీబీఎస్ఈ బోర్డు విధానం ప్రకారం, విద్యార్థుల తుది ఫలితాలను సిద్ధం చేయడానికి రెండు పరీక్షలలో (మెయిన్ ఎగ్జామ్, రెండవ పరీక్ష) వారి మెరుగైన పనితీరు అంటే బెస్ట్ స్కోర్ ఆధారంగా రిజల్ట్స్ పరిగణిస్తారు. పరీక్షకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు డిజిలాకర్ పోర్టల్లో తమ ఫలితాలను ఆన్లైన్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
ఇంప్రూవ్మెంట్ పరీక్షలో 59.95% మంది విద్యార్థులు బెస్ట్ స్కోర్
సీబీఎస్ఈ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం రెండవ బోర్డు ఎగ్జామ్ కోసం మొత్తం 6,64,027 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 6,63,777 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వీరిలో 5,13,955 మంది విద్యార్థులు ప్రధాన పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన తర్వాత తమ స్కోర్ను మెరుగుపరుచుకోవడానికి మళ్లీ ఎగ్జామ్ రాశారు. బోర్డుకు ఈ ప్రయోగం సక్సెస్ అయింది. ఎందుకంటే 3,08,095 మంది విద్యార్థులు ప్రధాన పరీక్షతో పోలిస్తే రెండోసారి రాసిన పరీక్షలో మార్కులను మెరుగు చేసుకున్నారు.
పెరిగిన కంపార్ట్మెంట్ కేటగిరీ పాస్ శాతం
సీబీఎస్ఈ రెండవ బోర్డు పరీక్షతో పాటు నిర్వహించిన కంపార్ట్మెంట్ పరీక్షలకు ఈసారి 1,49,822 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 78,503 మంది విద్యార్థులు సక్సెస్ అయ్యారు. ఈ సంవత్సరం కంపార్ట్మెంట్ కేటగిరీ మొత్తం పాస్ శాతం 52.40 శాతం నమోదైంది. గత సంవత్సరం 48.68 శాతంతో పోలిస్తే మెరుగైన రిజల్ట్ ఇది. ప్రధాన పరీక్ష, ఈ రెండవ బోర్డు పరీక్ష రెండింటి లెక్కలు కలిపి, 2026 సంవత్సరానికి 10వ తరగతి మొత్తం పాస్ శాతం 96.78 శాతానికి చేరుకుంది.
డిజిలాకర్, స్కూల్ నుండి డిజిటల్ పత్రాలు
అన్ని అనుబంధ పాఠశాలలకు వారి రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీలకు విద్యార్థుల ఫలితాలు, డిజిటల్ సర్టిఫికెట్లు పంపుతామని CBSE స్పష్టం చేసింది. విదేశాలలో ఉన్న CBSE విద్యార్థులు కూడా డిజిలాకర్ ద్వారా తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈజీగా సర్టిఫికేట్లను పొందవచ్చు.
రెగ్యులర్ విద్యార్థులు.. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లే విద్యార్థుల ఒరిజినల్ మార్క్షీట్లు, పాసింగ్ సర్టిఫికేట్లు వారి సంబంధిత స్కూల్ నుంచే పొందచ్చు.
ప్రైవేట్ విద్యార్థులు.. ప్రైవేట్ అభ్యర్థులకు వారి డిజిటల్ పత్రాలు నేరుగా డిజిలాకర్లో అందుబాటులో ఉంచుతారు.
ఢిల్లీ విద్యార్థులు: ఢిల్లీ తూర్పు, ఢిల్లీ పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలోకి వచ్చే ప్రైవేట్ విద్యార్థులు డిజిలాకర్తో పాటు తమ స్కూల్, కేటాయించిన పరీక్షా కేంద్రం నుండి కూడా డిజిటల్ సర్టిఫికెట్స్ పొందవచ్చు.
