PM Modi Speech in Lok Sabha: పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నేడు (ఫిబ్రవరి 5) లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇచ్చారు. తన మొత్తం ప్రసంగంలో ఎక్కడా రాహుల్ గాంధీ పేరుగానీ, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లు గానీ చెప్పకుండానే విమర్శలు చేశారు. కాంగ్రెస్ లో కుటుంబ వాదం ఉందంటూ ప్రధాని మోదీ ఎప్పటిలాగే తప్పుబట్టారు. బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలో ఉంటూ వస్తుండగా.. మొదటిసారి, రెండోసారి తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. మరో వంద రోజుల్లో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. దానికి బ్లూప్రింట్‌ కూడా రెడీగా ఉందని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన లోటుపాట్లను తాము మొదటి టర్మ్ లో అధికారంలోకి రాగానే పూడ్చగలిగామని.. రెండోసారి అధికారం చేపట్టగానే కొత్త భారతదేశానికి పునాది వేశామని అన్నారు. మూడోసారి తాము భారతదేశాన్ని పునర్ నిర్మిస్తామని చెప్పారు.


ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంఖాలు
ప్రతిపక్షంగా తన బాధ్యతను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశానికి మంచి ప్రతిపక్షం అవసరమని తానెప్పుడూ అంటున్నానని.. చాలా మంది ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కోల్పోయారని అనిపిస్తోందని అన్నారు. చాలా మంది సీట్లు మారే ఆలోచనలో ఉన్నారని తెలిసిందని అన్నారు.. ఇప్పుడు చాలా మంది లోక్‌సభకు బదులు రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారని అన్నారు.


దేశం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయాలన్నీ రెండో టర్మ్ లో పూర్తి చేయడం చూశాం. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేశాం. రెండో టర్మ్‌లో నారీ శక్తి వందన్ చట్టం వచ్చింది. అంతరిక్షం నుంచి ఒలింపిక్స్‌ వరకు, సాయుధ బలగాల నుంచి పార్లమెంట్‌ వరకు మహిళా శక్తి ప్రతిధ్వనిస్తోంది. గత 10 ఏళ్లలో పర్యటక రంగంలో అపూర్వమైన బూమ్ ఉంది. సామాన్యులకు సైతం ఉపాధి కల్పించే రంగం, స్వయం ఉపాధికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి. గత 10 ఏళ్లలో విమానాశ్రయాలు రెట్టింపు అయ్యాయి.


ఈసారి ఎన్డీయే 400 దాటుతుంది
కొద్ది రోజుల క్రితం కర్పూరీ ఠాకూర్‌ను భారతరత్నతో సత్కరించాం. 1970లో బిహార్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అనేక చర్యలు చేపట్టారు. ఓబీసీని కాంగ్రెస్ సహించదు. ప్రభుత్వంలో ఓబీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కలు వేసుకుంటూ ఉంటారు. మీరు (కాంగ్రెస్) ఇక్కడ అతిపెద్ద OBCని చూడలేదా? మా ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎంతో దూరంలో లేదు. 100-125 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేను లెక్కల ప్రకారం వెళ్లను, కానీ దేశ మానసిక స్థితిని అంచనా వేయగలను. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే 400 దాటుతుంది. బీజేపీకి 370 సీట్లు రావడం ఖాయం. మూడో టర్మ్ లో కూడా మేం చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం.


కాంగ్రెస్ ది రద్దు సంస్కృతి
కాంగ్రెస్ ధీమాతో పోల్చుకోలేం. నేడు దేశంలో పనులు జరుగుతున్న వేగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించలేకపోయింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ అవతరిస్తుంది. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్‌లో రద్దు సంస్కృతి ఏర్పడింది. ఏది జరిగినా రద్దు చేయడమే. కాంగ్రెస్ ఇలాంటి రద్దు సంస్కృతిలో కూరుకుపోయింది. మేం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం. రద్దు చేయమని కాంగ్రెస్ చెబుతోంది. మేం లోకల్ కోసం వోకల్ అంటాం. కాంగ్రెస్ చెప్పింది-రద్దు. వందే భారత్ రైలు తెచ్చాం. కాంగ్రెస్ చెప్పింది-రద్దు చేయాలని.


కాంగ్రెస్ నేతలు మోటారు మెకానిక్‌లుగా కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కాబట్టి, వారు అలైన్‌మెంట్ అంటే ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. ఆఖరికి వారు పెట్టుకున్న పొత్తులు కూడా దిగజారిపోయాయని అన్నారు. దేశ సామర్థ్యాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మలేదని ప్రధాని మోదీ అన్నారు.