Bihar Reservation Bill: 



65% కి పెరిగిన రిజర్వేషన్‌లు


రిజర్వేషన్లు పెంచాలంటూ బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్‌ల సవరణ బిల్‌ (Bihar Reservation Amendment Bill ) పాస్ అయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65% వరకూ పెంచేందుకు లైన్ క్లియర్ అయింది. నవంబర్ 7వ తేదీనే రాష్ట్ర కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. OBC,SC,ST రిజర్వేషన్‌లు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే...ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసెంబ్లీలో లేని సమయంలో ఈ బిల్ పాస్ అయింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో రిజర్వేషన్‌లు 50% వరకూ ఉన్నాయి. ఈ సంఖ్యని 65%కి పెంచాలని నితీశ్ భావించారు. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్‌లు 50% మాత్రమే ఉండాలి. షెడ్యూల్ తెగలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఈ రిజర్వేషన్‌లను పెంచాలని నిర్ణయించుకున్నట్టు గతంలోనే నితీశ్ ప్రకటించారు. ఈ 65% కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన Economically Weaker Sections (EWS)కోటా 10% కలిపి మొత్తంగా 75% మేర రిజర్వేషన్‌లు అమలవనున్నాయి. వర్గాల వారీగా చూస్తే...రిజర్వేషన్‌ల శాతాలు ఇలా ఉన్నాయి. 


షెడ్యూల్ కులాలు - 20%


షెడ్యూల్ తెగలు - 2%


ఇతర వెనకబడిన వర్గాలు (OBC), EBC కోటా - 43%


 






ప్రస్తుతానికి EBC కోటా కింద 18% రిజర్వేషన్‌లున్నాయి. OBCలకు 12%, ఎస్సీలకు 16%, STలకు 1%, వెనకబడిన వర్గాలకు చెందిన మహిళలకు 3% రిజర్వేషన్‌లున్నాయి. అయితే...ప్రస్తుతం బిహార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో కేంద్రం తీసుకొచ్చిన EWS కోటా గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోవడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఎలాంటి సందిగ్ధత ఉండకూడదని తేల్చి చెప్పింది. దీనిపై బిహార్ మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం OBC,SC,STలను ఉద్దేశించి చేసిన సవరణలు మాత్రమే అని తేల్చిచెప్పారు. వీటితో పాటు EWS కోటా కింద 10% రిజర్వేషన్‌లు కూడా అమలవుతాయని అన్నారు.ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బిహార్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కులగణన (Bihar Caste Census) పేరు చెప్పి ప్రభుత్వం ముస్లింలను, యాదవుల మధ్య చిచ్చు పెడుతోందని మండి పడ్డారు. అయితే నితీశ్ కుమార్ (Nitish Kumar) మాత్రం కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేపట్టాల్సిన అవసరముందని సూచించారు. రిజర్వేషన్‌లను పెంచాలని అన్నారు. 


"పేదల ఆర్థిక స్థితిని మెరుగు పరిచేందుకు నేను ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేందుకు వెనకాడను. అలాంటి కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తాను. కేవలం ఆ కుటుంబాల కోసం ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం రూ.2.5 లక్షల కోట్లు కేటాయించింది. బిహార్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుకుంటున్నాను"


- నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి


Also Read: అలాంటి నీచమైన భాష మరెవరూ వాడకూడదు - నితీశ్ వ్యాఖ్యలపై చిదంబరం అసహనం