Bihar News: ఓ యువకుడి పట్ల గ్రామస్థులు అంత్యంత అమానవీయ రీతిలో, అనాగరికంగా వ్యవహరించారు. అతని చేత నేలపై ఉమ్మి వేయించి, దాన్ని అతనితోనే నాకించారు. ఈ జుగుప్సాకరమైన ఘటన బిహార్‌లో జరిగింది. బిహార్‌లోని సమస్తిపూర్ లోకి ఇంకెప్పుడూ రాకూడదని కూడా యువకుడిని బెదిరించారు. మళ్లీ అక్కడికి రాబోనని హామీ ఇచ్చిన ఆ తర్వాత విడిచిపెట్టారు. ప్రేయసిని కలుసుకునేందుకు ఆమె ఊరు వెళ్లిన సందర్భంగా యువకుడికి ఈ చేదు ఘటన ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా కూడా మారాయి. ఈ వీడియో పోలీసులకు దృష్టికి చేరింది. దీంతో పలువురు గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


బిహార్ లోని ఉజియార్‌పుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. అదే ఏరియాకి చెందిన మెహసారి అనే గ్రామానికి చెందిన యువకుడు మరో గ్రామం చఖబీబ్‌ గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరు ఇద్దరి వైపు నుంచి ప్రేమ ఉండగా, ఆమెను దిగబెట్టడానికి యువకుడు ప్రియురాలిని బైక్ పై ఎక్కించుకొని ఆమె గ్రామానికి వెళ్లాడు. వీరు ఇద్దరినీ చూసిన గ్రామస్థులు యువకుడిని పట్టుకుని అతడిపై దాడి చేశారు. పలువురు ఆగ్రహం వ్యక్తం చేసి ఇష్టమొచ్చినట్లుగా దాడి చేశారు. అనంతరం పంచాయితీ పెట్టించారు.


ఈ సందర్భంగానే యువకుడితో దారుణమైన పని చేయించారు. ఏకంగా నేలపై అతనితో ఉమ్మి వేయించి అతడితోనే నాకించారు. ఇంకెప్పుడూ గ్రామంలోకి రావద్దని బెదిరింపులకు గురి చేసి విడిచిపెట్టారు. యువకుడిపై గ్రామస్థులు పాల్పడుతున్న ఈ దుష్ట చర్యను ఓ వ్యక్తి వీడియో తీసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. వీడియో ఆధారంగా వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.


రెండ్రోజుల్లో మూడు హత్యలు


మరోవైపు, ఇదే సమస్తిపూర్‌ ప్రాంతంలో రెండు రోజుల వ్యవధిలో, విభూతిపూర్, ఉజియార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకదాని తర్వాత ఒకటిగా మూడు హత్యలు జరిగాయి. శనివారం అర్థరాత్రి ఖోక్సాహా గ్రామంలో యువకుడిని హత్య చేసిన కేసులో, కర్రఖ్ గ్రామంలో ఆదివారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధుడిని దుండగులు పదునైన ఆయుధంతో హత్య చేసిన కేసులో పోలీసులు విచారణ చేస్తుండగా, అదే సమయంలో ఉజియార్‌పూర్‌లోని థియేటర్ బయట చిన్నారిని కొట్టి చంపారు. ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి.


వృద్ధుడి కేసులో విభూతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవండా వార్డ్ నంబర్ 7లో నివాసం ఉంటున్న రాంవిలాస్ మహతోగా గుర్తించారు. రాత్రి భోజనం చేసి అతను ఇంట్లోనే నిద్రిస్తున్నాడు. అర్థరాత్రి నేరస్థులు ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధంతో నరికి చంపారు. పారిపోతున్న సమయంలో, భయాందోళన కలిగించేందుకు మూడు-నాలుగు రౌండ్లు కూడా కాల్చారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. సోమవారం తెల్లవారుజామున జనం గుమిగూడారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.