తొలి దశ పోలింగ్ గురువారం జరగనున్న నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాతో సహా మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. 


వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పీఎం మోదీ... అసెంబ్లీ ఎన్నికలు, వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో తన భద్రతా ఉల్లంఘన, రాజవంశ రాజకీయాలు, పార్లమెంట్‌లో తన ప్రసంగం సహా పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.


ANIకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఇవే:






1. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ వేవ్ కనిపిస్తోంది. అఖండ మెజారిటీతో గెలుస్తాం, 5 రాష్ట్రాల ప్రజలు తమకు సేవ చేసే అవకాశం కల్పిస్తారు. ప్రజలకు సేవ చేయడంలో బీజేపీ ఎప్పుడూ ముందు ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' మంత్రంతో పని చేస్తాం. ఎక్కడైతే బీజేపీకి సుస్థిరతతో పని చేసే అవకాశం లభించిందో, అక్కడ అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది తప్ప వ్యతిరేక ప్రభావం ఉండదు. ఎప్పుడూ పాజిటివ్‌ వేవ్‌తోనే ఎన్నికల బరిలోకి బీజేపీ దిగుతుంది.






2. దేశ ప్రయోజనాల దృష్ట్యా మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. "రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కానీ ఇప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా దానిని ఉపసంహరించుకున్నాం. దీనిని ఇకపై వివరించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామో భవిష్యత్ సంఘటనలు స్పష్టం చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు.






3. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో తన భద్రతా ఉల్లంఘన ఘటనపై స్పందించమని అడిగినప్పుడు, సుప్రీం కోర్టు నిర్దేశించిన దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఈ అంశంపై తాను మాట్లాడబోనని ప్రధాని మోదీ అన్నారు. "ఈ అంశంపై నేను మాట్లాడను. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో నేను చేసే ప్రకటన ఏదైనా దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది. ఇది సరికాదు" అని ఆయన అన్నారు.






4. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు మోదీ. "వంశపారంపర్య రాజకీయాలను" ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని అభిప్రాయపడ్డారు. "ఒక కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు ఎన్నికై ఎమ్మెల్యేలు కావడం పార్టీని ఒక కుటుంబానికి చెందినదిగా మార్చదు. ఒక కుటుంబం ద్వారా తరతరాలుగా పార్టీని నడుపుతున్నప్పుడు, అక్కడ రాజరికం మాత్రమే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రారంభిస్తే  రెండు పార్టీలను రెండు కుటుంబాలు నడుపుతున్నాయి. హర్యానా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ఇదే ధోరణిని కనిపిస్తోంది. రాజరిక రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువు" అని ఆయన అన్నారు.






5. పార్లమెంట్‌లో బడ్జెట్ సెషన్‌లో ఇటీవల చేసిన ప్రసంగం గురించి అడిగినప్పుడు, మోదీ తాను ఎవరి తండ్రి లేదా తాత గురించి మాట్లాడలేదని అన్నారు. "ఒక మాజీ ప్రధాని చెప్పినట్లు నేను చెప్పాను. అలాంటివి తెలుసుకోవడం ఇది దేశం హక్కు. నెహ్రూ జీ గురించి మేం ప్రస్తావించలేదని వారు అంటున్నారు. అలా చేసినా వాళ్లకు కష్టమే. ఏం చేసినా వాళ్లకు భయమే. అదే నాకు అర్థం కావడం లేదు." ప్రధాన మంత్రి అని మోదీ అన్నారు.