Devotees offer prayers to Lord Shri Ram in Ayodhya in six days: అయోధ్య: దాదాపు 5 శతాబ్ధాల తరువాత అయోధ్యలో రామ మందిరం కల ఇటీవల సాకారమైంది. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 22న మధ్యాహ్నం బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయడం తెలిసిందే. భారత్ తో పాటు పలు దేశాల్లో ఈ వేడుకను కన్నులారా వీక్షించారు. జనవరి 23 నుంచి అయోధ్య రామాలయం (Ram Mandir in Ayodhya)లో భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. దాంతో అయోధ్యకు భక్తులు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. తొలి వారంలోనే, అది కూడా మొదటి ఆరు రోజుల వ్యవధిలోనే అయోధ్య రామ మందిరాన్ని 18.75 లక్షల మంది యాత్రికులు సందర్శించారు. 




జన్మభూమిలో రామయ్య కొలువు తీరడంతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రామ్ లల్లా పవిత్రోత్సవం తరువాత దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. అయోధ్య బాలరాముడ్ని కనులారా చూసేందుకు, స్వామి వారి సేవలో పాల్గొనేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారని అధికారులు తెలిపారు. ఆలయంలో సామాన్యులకు దర్శనం కల్పించాక.. ఆరు రోజుల వ్యవధిలో, 18.75 లక్షల మంది యాత్రికులు అయోధ్య రాముడి సన్నిధికి వచ్చి సేవలో పాల్గొన్నారు. 


23 జనవరిన 5 లక్షల మంది భక్తులు అయోధ్య రామాలయాన్ని దర్శించుకోగా, 24 జనవరి రోజు 2.5 లక్షలు, 25 జనవరి 2 లక్షలు, 26 జనవరి 3.5 లక్షలు, 27 జనవరి 2.5 లక్షల మంది, 28 జనవరి 3.25 లక్షల మంది అక్కడికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాట్లను నిశితంగా నిర్వహించడానికి ఒక విశిష్ట కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తుంటుంది. 


జనవరి 22 న సంప్రోక్షణ కార్యక్రమం తరువాత, జనవరి 23న సామాన్య భక్తుల దర్శనార్థం ఆలయాన్ని తెరిచారు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు. శ్రీరాముని దర్శనం, ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు ప్రతిరోజూ కనీసం 2 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. భక్తుల తాకిడితో జై శ్రీరామ్ నినాదం అయోధ్యలో మార్మోగిపోతోంది.


అయోధ్యను దర్శించుకున్న భక్తుల సంఖ్య 
- 23 జనవరి - 5 లక్షలు
- 24 జనవరి - 2.5 లక్షలు
- 25 జనవరి - 2 లక్షలు
- 26 జనవరి - 3.5 లక్షలు
- 27 జనవరి - 2.5 లక్షలు
- 28 జనవరి - 3.25 లక్షలు


 






అయోధ్య రామాలయంలో ఆదివారం నాడు జరిగిన రాగోత్సవ వేడుకలో ప్రఖ్యాత ఒడిస్సీ నర్తకి, కేంద్రీయ సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత సుజాత మోహపాత్ర నృత్య ప్రదర్శన చేశారు. భగవంతుడు రాముడి పట్ల తనకున్న భక్తిని, ప్రేమను తన కళ ద్వారా చాటుకున్నారు. సుజాత మోహపాత్ర నృత్య ప్రదర్శన అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది.