పని భారం ఎక్కువైందని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా పరిశ్రమల శాఖలో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా పరిశ్రమల కేంద్రం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రవీణ్ పంచపాల్, జిల్లా యంత్రాంగానికి చెందిన క్వార్టర్స్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తలుపు పగులగొట్టి ప్రవీణ్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్ ప్రకటించారు. ఆ తర్వాత పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపారు.


సూసైడ్ నోట్ లో ఏం రాసి ఉందంటే?


కలెక్టరేట్‌లోని క్వార్టర్స్‌లో ఉంటున్న జిల్లా పరిశ్రమల కేంద్రం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రవీణ్ గదికి లోపలి నుంచి తాళం వేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు బృందం అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా ప్రవీణ్ గదిలో పడి ఉన్నాడు. అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మరణవార్త తెలియగానే కుటుంబం సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడి వద్ద సూసైడ్ నోట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


పనిభారం ఎక్కువగా ఉందని వేరే డిపార్ట్మెంట్‌కు బదిలీ చేయాలని పలుదఫాలు విజ్ఞప్తి చేసినట్లు సూసైడ్ నోట్‌లో రాశారు ప్రవీణ్. మార్చిలో ప్రమోషన్ వచ్చిన తర్వాత ప్రవీణ్ పంచ్ పాల్ ను జిల్లా పరిశ్రమల కేంద్రంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా నియమించినట్లు సమాచారం. అతను కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. 


కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రవీణ్ పంచపాల్ ను ఆసుపత్రికి తరలించినట్లు నగర ఎస్పీ మనోజ్ కటియాల్ తెలిపారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. "ప్రాథమికంగా, ఇది ఆత్మహత్య కేసు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. పోస్ట్ మార్టం రిపోర్టులో మరణానికి గల కారణాలు వెల్లడవుతాయి అన్నారు ఎస్పీ మనోజ్‌.