Nate Anderson of Hindenburg Research On Gautam Adani : హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తో గౌతమ్ అదానీ ఆస్తుల పతనం కొనసాగుతూనే ఉంది. మూడేళ్లలో తొలిసారిగా అదానీ వరల్డ్ టాప్ 10 బిలీయనర్ల ర్యాంకుల జాబితా నుంచి కిందకి జారిపోయారు. వరసగా ఏడు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి భారీగా అదానీ స్టాక్స్ పతనం కావడం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం ఆయన 61.3 బిలియన్‌ డాలర్లతో 21వ స్థానానికి పడిపోయారు. వారం రోజుల క్రితం ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు 21వ స్థానానికి జారిపోవటం ఆయన సామ్రాజ్యం పతనాన్ని సూచిస్తోంది. మొత్తంగా వారం రోజుల్లో అదానీ ఆస్తుల్లో 10లక్షల కోట్ల సంపద కరిగిపోయింది. ఈ స్థాయిలో అదానీని ఇబ్బంది పెట్టింది ఒకేఒక్క రిపోర్ట్ హిండన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్. న్యూయార్క్ బేస్ గా పనిచేసే సంస్థను నడిపిస్తోంది ఎవరు. ఎందుకు అతను అదానీని టార్గెట్ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.


నేట్ ఆండర్సన్. హిండెన్ బర్గ్ రీసెర్చ్ కి ఇతడే ఫౌండర్ అని చెబుతారు. కానీ బయటి ప్రపంచానికి ఆండర్సన్ కనిపించేది చాలా తక్కువ. యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ లో డిగ్రీ చేసిన ఆండర్సన్...ఎప్పుడూ అంతుచిక్కని, చిక్కుముళ్ల లాంటి ప్రశ్నలపైనే తన ఆలోచనలు సాగించేవాడని బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ చేసింది.
అంబులెన్స్ డ్రైవర్ గా చేసిన నేట్ అండర్సన్
వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ల బ్యాడ్ బెట్స్ పోడ్ కాస్ట్ లో ఓ సారి చిన్నతనంలో తను ఆర్థడాక్స్ జ్యూస్ తో బుక్ ఆఫ్ జెనిసిస్... మోడ్రన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ పై మీద డిబేట్స్ చేసి ఓడిపోయానని షేర్ చేసుకున్నాడు ఆండర్సన్. అయితే 2004-05 మధ్య ఏడాది కాలం ఇజ్రాయెల్ లో అంబులెన్స్ డ్రైవర్ కూడా నేట్ అండర్సన్ పనిచేశారని చెప్తారు. ఆ తర్వాత అనేక పెట్టుబడుల సంస్థల్లో పనిచేసిన ఆండర్స్...చివరగా క్లారిటీ స్ప్రింగ్ పేరుతో తనే ఓ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీని ప్రారంభించాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు అంటే 2018 చివర్లో ఈ హిండన్ బర్గ్ రీసెర్చ్ ను ప్రారంభించాడు నేట్ ఆండర్సన్.



అదానీ కంపెనీల్లాగే గతంలో మరో కంపెనీ షేర్లు పతనం
హిండెన్ బర్గ్ రీసెర్చ్ ను ఫైనాన్షియల్ రీసెర్చ్ ఫోరెన్సిక్ గా చెప్పుకుంటాడు ఆండర్సన్. ఈక్విటీ, క్రెడిట్, డెరివేటివ్స్ అనాలసిస్ చేస్తూ ఉంటారు వీళ్లు. ఎంప్లాయిస్ కూడా ఐదుగురి కంటే ఎక్కువ ఉండరని చెబుతారు. వేర్వేరు దేశాల్లో తమకున్న సోర్సుల ద్వారా పెద్దమొత్తంలో అక్రమ వ్యాపారాలు చేస్తున్న ప్రజలను మోసగిస్తున్న కంపెనీల కూపీలు లాగి వారి షేర్లను దారుణంగా దెబ్బతీశారు. ఎంత దారుణంగా అంటే అదానీ కంటే ముందు 2020లో హిండన్ బర్గ్ నికోలా అనే ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ మీద ఇలానే రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చింది. ఫలితంగా ఆ కంపెనీ షేర్లు కుప్పకూలటంతో పాటు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ట్రెవర్ మిల్టన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
అంతటి శక్తిమంతుడైన, పక్కా ప్రణాళికలను పాటించే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు నేట్ ఆండర్సన్. ఐదేళ్లు మాత్రమే పూర్తి చేసుకున్న తన కంపెనీతో ఇప్పటికే 16 దిగ్గజ కంపెనీలను దివాలా తీయించారు. ఇప్పుడు అతని దృష్టి అదానీ కంపెనీల పైన పడింది. ఇప్పటికే 10లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిన అదానీ తిరిగి కోలుకుంటారో లేదా అండర్సన్ దెబ్బకు కుదేలైన 17వ కంపెనీగా మారుతారో చూడాలి.