PM Modi 10 Year Rule: న్యూఢిల్లీ: రాజకీయ నాయకులకు వచ్చే ఏడాది చాలా కీలకం. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇటీవల సెమీఫైనల్‌గా భావించిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ విజయం సాధించింది. దాంతో ఫైనల్ గా భావించే 2024 సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024)పై బీజేపీ, కాంగ్రెస్ లతో పాటు పలు పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. 


నరేంద్రమోదీ నేతృత్వంలోని అధికార పక్షం ఎన్డీఏ మరోసారి అధికారం చేపట్టి.. హ్యాట్రిక్ కొడుతుందా, దాదాపు 10 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనపై ప్రజాభిప్రాయాన్ని ఏబీపీ సీ ఓటర్ (ABP CVoter Survey) సేకరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 47 శాతం మంది ప్రధాని మోదీ పనితీరుపై  చాలా సంతృప్తిగా ఉన్నారు. మోదీ పాలనపై 30 శాతం మంది అంత సంతృప్తిగా లేరని.. మరో 21 శాతం మంది అయితే ఏవిధంగానూ మోదీ పాలనతో సంతృప్తిగా లేమని చెప్పారు. 2 శాతం మంది ప్రధాని పాలనపై ఏ అభిప్రాయం లేదన్నారు. 


పంజాబ్, పశ్చిమ బెంగాల్
అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారంలో ఉన్న పంజాబ్‌లో 39 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ పని పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. 26 శాతం మంది తక్కువ సంతృప్తిగా ఉన్నారని, 25 శాతం మంది సంతృప్తిగా లేరని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో 36 శాతం మందికి మోదీ పాలనకు జై కొట్టారు. 37 శాతం మంది పర్లేదని, 34 శాతం మంది పూర్తి అసంతృప్తిగా ఉన్నారు.


ఉత్తర ప్రదేశ్
అత్యధిక పార్లమెంట్ సీట్లున్న యూపీలో 48 శాతం మంది ప్రధాని మోదీ పని పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. 27 శాతం మంది పర్లేదు అని చెప్పగా.. మిగతా 25 శాతం మంది మోదీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఛత్తీస్‌గఢ్, బిహార్
ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ లో 54 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ పనితీరుపై చాలా సంతృప్తిగా ఉండగా.. 26 శాతం మంది పర్లేదు అన్నారు. మరో 20 శాతం ప్రజలు మోదీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


బిహార్‌లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 57 శాతం మంది పదేళ్ల మోదీ పాలనకు జై కొట్టారు. 22 శాతం మంది పర్వాలేదని చెప్పగా.. మిగతా 20 శాతం మంది మోదీ పని పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.


కర్ణాటక, తెలంగాణ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది అధికారం చేపట్టింది. కానీ కర్ణాటకలో 56 శాతం మంది ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ పని పట్ల చాలా సంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో తెలిపారు. 25 శాతం మంది ప్రజలు అసంతృప్తి వెల్లగక్కగా, మిగతా 19 శాతం మంది మోదీ పాలన పరవాలేదన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం తెలంగాణ ప్రజలు ప్రధాని మోదీ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారు. మరో 32 శాతం మంది అంచనాలు అందుకోలేకపోయారని చెప్పగా, మిగతా 21 శాతం మంది పదేళ్ల మోదీ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 


రాజస్థాన్, మధ్యప్రదేశ్
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో బీజేపీ విజయం సాధించడం తెలిసిందే. రాజస్థాన్‌లో 56 శాతం మంది ప్రధానిగా మోదీ పాలన బాగుందన్నారు. 25 శాతం మంది మోదీ నిర్ణయాలు పరవాలేవని చెప్పగా.. మిగతా 19 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారు. 
సర్వేలో పాల్గొన్న వారిలో మధ్యప్రదేశ్‌లో 55 శాతం మంది ప్రధాని మోదీ నిర్ణయాలు, పనితీరును ప్రశంసించారు. 26 శాతం మంది ప్రధాని మోదీ పాలన పరవాలేదని చెప్పగా, మిగతా 19 శాతం మంది పూర్తి అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో తేలింది.


మహారాష్ట్రలోనూ మోదీకి ఓకే..
మహారాష్ట్రలో సీ ఓటర్ సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది ప్రధానిగా నరేంద్ర మోదీ పని పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. 30 శాతం మంది పరవాలేదని అభిప్రాయపడగా.. మిగతా 25 శాతం మంది మోదీ పాలన బాగోలేదన్నారు.


[Disclaimer: This Opinion poll was conducted by CVoter. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding off. The margin of error is +/- 3% at the macro level and +/- 5% at the micro level.]