Hindu Man Wears Burqa: 


ఉచిత బస్ ప్రయాణం కోసం..


కర్ణాటకలో మహిళలందరికీ ఉచితంగా బస్ ప్రయాణం అని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అది అమలుచేసింది. కానీ...బస్‌లలో సీట్‌ల కోసం నానా తంటాలు పడుతున్నారు మహిళలు. 50% సీట్‌లు పురుషులకే కేటాయించి...మిగతా 50% సీట్‌లు మహిళలకు ఉచితం అని మెలిక పెట్టింది ప్రభుత్వం. ఫలితంగా...కెపాసిటీ కంటే ఎక్కువ మంది  బస్ ఎక్కుతున్నారు. పురుషులకూ సీట్‌ దొరక్కుండా పోతోంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి బుర్కా వేసుకుని బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తూ కనిపించాడు. అటుగా వెళ్లే వాళ్లు ఆ వ్యక్తిని చూసి అనుమానంతో నిలదీశారు. అయితే...ఆ వ్యక్తి కేవలం భిక్ష అడగడానికే ఇలా మారు వేషం వేసుకున్నట్టు బుకాయించాడు. కానీ...స్థానికులు మాత్రం దీన్ని నమ్మలేదు. బస్‌లో ప్రయాణం చేసేందుకు ఇలా మహిళలా బుర్కా వేసుకుని వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా హైలైట్ ఏంటంటే...ఓ మహిళ ఆధార్ కార్డ్ కూడా దగ్గరే పెట్టుకున్నాడు. మొత్తానికి స్థానికులు నిలదీయడం వల్ల అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 


కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 హామీల్లో కీలకమైంది...మహిళలకు ఉచిత బస్ సౌకర్యం. "శక్తి యోజనే" (Shakti Yojane) పథకంలో భాగంగా ఇది అమలు చేస్తామని చెప్పారు సీఎం సిద్దరామయ్య. జూన్ 11న అధికారికంగా ఈ స్కీమ్‌ని ప్రారంభించారు. బెంగళూరులోని విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఈ పథకాన్ని లాంఛ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్డినరీ బస్‌లలో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు. కర్ణాటక రవాణాశాఖ మంత్రి రామలింగా రెడ్డి ఇదే విషయాన్ని వెల్లడించారు. 


"కర్ణాటక వ్యాప్తంగా మహిళలు సౌకర్యవంతంగా ప్రయాణించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. షార్టేజ్‌ ఉన్న మార్గాల్లో బస్‌ల సంఖ్యను తప్పకుండా పెంచుతాం. ఇవాళ మధ్యాహ్నం (జూన్ 11) ఒంటిగంట నుంచి మహిళలందరూ ఉచితంగా బస్‌లలో ప్రయాణించొచ్చు"


- రామలింగా రెడ్డి, కర్ణాటక రవాణా మంత్రి 


మూడు నెలల్లో మహిళలందరూ శక్తి స్మార్ట్ కార్డ్స్ ( Shakti Smart Cards) కోసం అప్లై చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కార్డ్‌లతో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. అయితే...మహిళల వ్యక్తిగత సమాచారం ఈ కార్డ్‌లలో ఉంటుంది కనుక...ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదముందన్న వాదనలు వినిపించాయి. దీనిపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. డేటా ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా...కార్డ్స్‌ని తయారు చేసినట్టు స్పష్టం చేసింది. ఈ శక్తి స్కీమ్ కేవలం ఆర్డినరీ బస్‌లకు (BMTC) మాత్రమే వర్తించనుంది. వేరే రాష్ట్రానికి ట్రావెల్ చేసే వాళ్లకు ఈ స్కీమ్‌ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. KSRTC, KKRTCకి చెందిన బస్‌లలో 50% సీట్లు పురుషులకే కేటాయించింది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మహిళలు ఈ స్కీమ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ... ప్రభుత్వం మాత్రం తాము ఇచ్చిన హామీని నెరవేర్చినట్టు స్పష్టం చేసింది. అయితే...మహిళలు సీట్‌ల కోసం గొడవ పడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. 


Also Read: Tomato Price: తగ్గేదే లేదంటున్న టమాటా, రూ.162కి పెరిగిన కిలో ధర