న్యూఢిల్లీ: దేశంలోని 4,092 మంది ఎమ్మెల్యేలలో 45 శాతం మంది నేతలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ADR) నివేదిక విడుదల చేసింది. నేతలు ఇటీవల ఎన్నికలకు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్ ఈ రిపోర్ట్ రూపొందించింది. మొత్తం 4123 మంది ఎమ్మెల్యేలు కాగా, 24 మంది శాసనసభ్యుల అఫిడవిట్లు సరిగ్గా స్కాన్ చేయని కారణంగా వాటిని విశ్లేషించలేదని తెలిపింది.


ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం దేశంలోని 4092 మంది ఎమ్మెల్యేలలో 1,861 మంది ఎమ్మెల్యేలు అంటే 45 శాతం ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించారు. 29 శాతం ఎమ్మెల్యేలు అంటే 1,205 మంది పై హత్య, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలు లాంటి తీవ్ర అభియోగాలు ఉన్నాయి. 127 మంది ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు పాల్పడ్డ కేసులు, అందులో 13 మంది నేతలపై అత్యాచారం కేసులున్నాయి.


కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలే టాప్..
1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులుండగా, అధికంగా ఏపీ ఎమ్మెల్యేలపై కేసులున్నాయి. 175 ఎమ్మెల్యేల్లో ఏకంగా 138 మంది ఎమ్మెల్యేలు క్రిమినల్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 79 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులతో ఏపీ అగ్ర స్థానంలో నిలిచింది. కేరళలో 69 శాతం, తెలంగాణలో 69 శాతం శాతం, బిహార్‌ లో 66 శాతం, మహారాష్ట్రలో 65 శాతం, తమిళనాడులో 59 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి. 


తీవ్ర నేరాభియోగాల్లోనూ ఏపీ నేతలే టాప్
తీవ్ర నేరాభియోగాలు ఉన్న శాసనసభ్యుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలే తొలి స్థానంలో ఉన్నారు. 56 శాతం ఎమ్మెల్యేలు అంటే 98 మంది నేతలపై తీవ్ర నేరాభియోగాలు నమోదయ్యాయి. తెలంగాణలోని 50 శాతం ఎమ్మెల్యేలపై, బిహార్‌ లోని 49 శాతం ఎమ్మెల్యేలు, ఒడిశాలోని 45 శాతం ఎమ్మెల్యేలు, ఝార్ఖండ్‌ లోని 45 శాతం ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.



పార్టీల ప్రకారం చూస్తే బీజేపీ టాప్..
బీజేపీ 1653 ఎమ్మెల్యేలలో 638 (39 శాతం) మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 436 మంది (29 శాతం) ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన 646 ఎమ్మెల్యేలలో 339 (52 శాతం) మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 194 (30) మంది ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలున్నాయి.
టీడీపీకి చెందిన 134 మంది ఎమ్మెల్యేలలో 115 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 82 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు నమోదయ్యాయి. 
తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ 132 మంది ఎమ్మెల్యేలలో 98 (74 శాతం) మంది నేతలపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 42 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 230 మంది ఎమ్మెల్యేలలో 95 (41 శాతం) మంది నేతలపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 78 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన 123 మంది ఎమ్మెల్యేలలో 69 (56 శాతం) మంది నేతలపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 35 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.
 నేతలు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన డేటా ఆధారంగా ఏడీఆర్ ఈ రిపోర్ట్ విడుదల చేసింది.