రుతుపవనాల ప్రభావానికి తోడు పశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన అలజడితో ఉత్తర భారత దేశాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఊళ్లు, నదులు ఏకమైపోతున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. చాలా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, ఛండీగడ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విధ్వంసం కొనసాగింది. 


72 గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు సుమారు 42 మంది మృతి చెందారు. ఉదయం 7 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం హిమాచల్‌ప్రదేశ్‌లో 20 మంది, జమ్ముకశ్మీర్‌ 15 మంది, ఢిల్లీలో ఐదుగురు, రాజస్థాన్, హర్యానాలో ‍ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. మున, బియాస్, సట్లేజ్ సహా ఇతర నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇళ్ళు నేలమట్టమవుతున్నాయి. పార్క్ చేసిన కార్లు పడవల్లా నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ఏదో సినిమాల్లో చూసినట్టుగానే అక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి. 






ఈ వరదలు, వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌ అత్యంత తీవ్రంగా దెబ్బతింది. ఈ రాష్ట్రంలో మృతుల సంఖ్య 20 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 4000 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. పరిస్థితి చక్కబడిన తర్వాత క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్లి పూర్తి నష్టాన్ని అంచనా వేయనున్నారు. 






ఎక్కువ నష్టం జరిగిన హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి కుదట పడే ఛాన్స్ కనిపిస్తోందని ఐఎండీ ప్రకటించింది. ఇన్ని రోజులు కొనసాగించిన రెడ్‌ అలర్ట్‌ను ఉపసంహరించుకున్నారు. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ సాయంత్రం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. 


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఎలక్ట్రిక్ సబ్-స్టేషన్లు, అనేక నీటి సరఫరా వ్యవస్థ ధ్వంసమైంది. మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటి వరకు 4,686 ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోయాయని. దీంతో వందల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.






మనాలి-లేహ్ జాతీయ రహదారిలో కొంత భాగం కుంగిపోయింది. దీంతో  లాహౌల్-స్పితి జిల్లా, లడఖ్‌కు కనెక్టివిటీ తెగిపోయింది. లాహౌల్-స్పితి, కులు జిల్లాల్లో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది పర్యాటకులు, స్థానిక ప్రజలను హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చంబా జిల్లాలోని భర్మౌర్ ప్రాంతంలోని మణిమహేష్ సరస్సు వద్దకు వెళుతున్న సుమారు 70 మంది పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు.






హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలోని పర్వానూ అనే పర్యాటక ప్రదేశంలో కార్లు నీటిలో కొట్టుకుపోతున్న విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. బాల్కనీలో ఉన్న వ్యక్తులు గట్టిగా కేకలు వేస్తూ ఆ విజువల్స్ క్యాప్చర్ చేశారు. 






హిమాచల్‌ ప్రదేశ్‌లో దాదాపు 800 రోడ్లు దెబ్బతిన్నాయి. 1,255 రూట్లలో హిమాచల్ రోడ్‌వేస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టిసి) బస్సు సర్వీసులు నిలిపివేసిందది. 576 బస్సులు వివిద ప్రాంతాల్లో మార్గ మధ్యలో నిలిచిపోయినట్టు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ సాయంత్రం నుంచి వర్షాలు తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. 






తీర్థయాత్రలో ఆరుగురు మరణించిన కారణంగా శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర ఆకస్మికంగా నిలపేశారు. మొహాలి, రోపర్, ఫతేఘర్ సాహిబ్, జలంధర్, పాటియాలాతో సహా అనేక ప్రాంతాలలో రెస్క్యూ, రిలీఫ్ టీమ్‌లు సిద్దంగా ఉన్నాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన పద్నాలుగు బృందాలు, ఎస్‌డిఆర్‌ఎఫ్‌లోని రెండు యూనిట్లు, 12 కాలమ్‌ల ఆర్మీ, పంజాబ్ పోలీసు సిబ్బందిని రంగంలోకి దించింది ప్రభుత్వం.


ప్రజలకు తక్షణ సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. వరదలకు ప్రజలు భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. పంట నష్టం, ఇళ్లు, పశువుల నష్టాన్ని అంచనా వేయడానికి గిర్దావరి అంటే సర్వే చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.


హర్యానాలో వర్షం కారణంగా రైలు మార్గాలు, జాతీయ రహదారులు, వంతెనలు, పవర్ స్టేషన్లకు తీవ్ర నష్టం జరిగింది. కర్నాల్‌లో ఇల్లు కూలిపోవడంతో దంపతులు ప్రాణాలు కోల్పోగా, పింజోర్‌లో కొండచరియలు విరిగిపడి ముగ్గురు చిన్నారులు మరణించారు. 






కొండచరియలు విరిగిపడటం, ట్రాక్‌లపై వరద నీరు రావడంతో కల్కా-సిమ్లా, చండీగఢ్-అంబాలా, అంబాలా-సహారన్‌పూర్, చండీగఢ్-మొరిండా, నంగల్-ఉనాతో సహా వివిధ మార్గాల్లో దాదాపు 50 రైళ్లు రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌సహా చండీగఢ్, న్యూఢిల్లీ మధ్య కొన్ని రైళ్లపై కూడా వరదల ప్రభావం పడింది. యమున ప్రమాద స్థాయిని మిుంచి ప్రవహిస్తోంది.యమునా నది నీటి మట్టం 205.33 మీటర్లు ఉంటే అది 206.24 మీటర్లకు మించి ప్రవహిస్తోంది.