మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన భికర ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. కొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం 6.30గం. సమయంలో కాల్పులు మొదలైనట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులకు, మావోలకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని సమాచారం. ఇప్పటి వరకూ 26 మంది మృతి చెందగా.. ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉంది. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 


కొత్గుల్-గ్యారపట్టి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు.. పోలీసులకు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎదురుపడగా.. మావోయిస్టులకు, పోలీసులకు నడుమ ఎదురు కాల్పులు మెుదలయ్యాయి. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ సీనియర్ సభ్యులు మిలింద్ బాబురావు తెల్తుంబ్డే అలియాస్ దీపక్ తెల్తుంబ్డే, ఛత్తీస్‌గఢ్ (MMC)  ప్రత్యేక జోనల్ కార్యదర్శి, డీవీసీ శుల్కలాల్ కూడా చనిపోయినట్టు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. 


కొన్ని సంవత్సరాలుగా.. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే పార్టీ బలహీనపడిపోయిందన్న చర్చ ఓ వైపు నడుస్తోంది. మావోయిస్టు పార్టీ మాత్రం ఇప్పటికీ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని నెలల క్రితం విశాఖలో జరిగిన ఎదురుకాల్పుల్లోనూ.. ముఖ్యమైన నేతలు మరణించారు. ఇటీవలే.. మావోయిస్టు నేత అగ్రనేత.. ఆర్కే కూడా మృతి చెందారు. మళ్లీ 26 మంది మృతితో మావోయిస్టు పార్టీకు పెద్ద దెబ్బ పడినట్టైంది.


బాంబు పేలి..  మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి


మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందినట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ఓ ప్రకటన జారీ చేసింది. బాంబులు పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదం జరిగి మావోయిస్టు రవి మృతి చెందాడని పేర్కొంది. మావోయిస్టు కేంద్ర కమిటీ టెక్ టీంలో రవి కీలక సభ్యుడు. రవి చనిపోయిన ఏడాదిన్నర తర్వాత ఆయన మృతిని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. ఝార్ఖండ్ లోని మారుమూల ప్రాంతంలో రవి మృతి చెందినట్లు మావోయిస్టులు తెలిపారు. టెక్నికల్ టీమ్ లో కీలక సభ్యులుగా కొనసాగిన రవి... కమ్యూనికేషన్స్ తోపాటుగా ఎలక్ట్రానిక్ డివైస్ తయారు చేయడంలో దిట్ట. 


తాను తయారుచేసిన బాంబులను పరీక్షిస్తున్న సమయంలోనే ప్రమాదవశాత్తు పేలి రవి మృతి చెందారు. ఏడాదిన్నర క్రితమే ఈ ప్రమాదం జరిగింది. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ రవి మరణాన్ని ఆలస్యంగా ధ్రువీకరించింది. మావోయిస్టు టెక్నికల్ టీంలో సభ్యుడిగా ఉన్న రవికి కమ్యునికేషన్స్‌తో పాటు ఎలక్ర్టికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారుచేయడంలో సిద్ధహస్తుడు. జూన్ 5, 2020న ఝార్ఖండ్‌లో జరిగిన ఓ బాంబు ప్రమాదంలో రవి మృతి చెందాడని, అతడి భౌతిక కాయాన్ని విప్లవ లాంఛనాలతో అంత్యక్రియలు చేశామని మావోయిస్టు పార్టీ వెల్లడించింది.


Also Read: Delhi LockDown : ఢిల్లీలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు.. కరోనా కాదు కాలుష్యం కారణం !


Also Read: Terrorist Attack: అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ పై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి