Lakshadweep Hotels: భారత్ - మాల్దీవులు మధ్య వివాదం మొదలుకావడంతో లక్షద్వీప్ లోని దీవులపై అందరి ఫోకస్ పడింది. ప్రధాని మోదీ ఎప్పుడైతే లక్షద్వీప్ ను సందర్శించి అక్కడి టూరిజంను ప్రమోట్ చేశారో అప్పటి నుంచి ఆ ప్రాంతం గురించే పర్యటకులు ఆసక్తి చూపుతున్నారు. కొందరు భారత పర్యటకులైతే మాల్దీవులకు తాము బుక్ చేసుకున్న టికెట్లు, హోటళ్ల బుకింగ్ లను క్యాన్సిల్ చేసేసుకున్నారు. మాల్దీవులకు బదులు లక్షద్వీప్ పర్యటనకు ప్లాన్ చేసుకుంటున్నారు.


Taj Hotels in Lakshadweep: ఇలా లక్షద్వీప్ కు టూరిస్ట్ ల నుంచి డిమాండ్ ఎక్కువవుతుండడం.. భారత దిగ్గజ సంస్థ టాటా గ్రూపునకు బాగా కలిసొచ్చింది. అక్కడ పర్యటకాన్ని మరింత పెంచేందుకు అందమైన, విలాసవంతమైన హోటళ్లు, రిసార్టుల నిర్మాణాన్ని గతేడాది జనవరిలో టాటా గ్రూపునకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ప్రారంభించింది. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ తాజ్ బ్రాండ్ నేమ్‌తో దేశ వ్యాప్తంగా ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లను నిర్వహిస్తోంది. అత్యంత విలాసవంతమైన అతిథ్యాన్ని వారు అందిస్తున్నారు. అలాంటి టాటా సంస్థ లక్షద్వీప్ లోని సుహేలి, కాద్మాట్ దీవుల్లో రెండు కొత్త రిసార్టులు నిర్మించనుంది. 2026 కల్లా ఈ రిసార్ట్ లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 


అంతర్జాతీయ పర్యటకుల్ని కూడా ఆకర్షించేలా


‘‘భారత దేశ పశ్చిమ తీరంలో అరేబియా సముద్రం మధ్య సహజమైన బీచ్‌లు, పగడపు దిబ్బలతో లక్షద్వీప్‌ దీవులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ పర్యటకుల తాకిడి పెరిగే అవకాశం చాలా ఉంది. అక్కడ మేం నిర్మిస్తున్న రెండు ప్రపంచ స్థాయి తాజ్ రిసార్ట్‌లు దేశీయంగానే కాక, అంతర్జాతీయ పర్యటకులను ఆకర్షిస్తాయి’’ అని ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ, సీఈవో పునీత్ ఛత్వాల్ ప్రకటించారు. గత సంవత్సరం జనవరిలోనే ఈ కొత్త రిసార్ట్‌ల నిర్మాణం కోసం సంతకం చేసినట్లు ప్రకటించారు.


లక్షద్వీప్, అరేబియా సముద్రంలో ఒక ద్వీపసమూహం, అన్యదేశ బీచ్‌లు, పగడపు దిబ్బలు మరియు మడుగులతో దాని సుందరమైన అందాలకు ప్రసిద్ధి చెందింది. "ఇది స్కూబా డైవింగ్, విండ్‌సర్ఫింగ్, స్నార్కెలింగ్, సర్ఫింగ్, వాటర్ స్కీయింగ్, యాచింగ్‌లతో సహా వాటర్ స్పోర్ట్స్‌కు లక్షద్వీప్ స్వర్గధామం’’ అని కంపెనీ తెలిపింది.


విల్లాలు, వాటర్ విల్లాలు


సుహేలి దీవిలోని బీచ్‌లో 60 విల్లాలు, 50 వాటర్ విల్లాలతో సహా మొత్తం 110 గదులతో నిర్మిస్తున్నట్లుగా తాజ్‌ హోటల్స్ కంపెనీ తెలిపింది. పెద్ద లాగూన్‌తో కూడిన పగడపు ద్వీపం, కడ్మత్ ద్వీపం ఉన్నాయి. దీనిని కార్డమామ్ ద్వీపం (Cardamom Island) అని కూడా పిలుస్తారు. ఇది సముద్రపు గడ్డితో కూడిన ఒక ప్రొటెక్టెడ్ ఏరియా. 110 గదులతో, కద్మత్‌లోని తాజ్ హోటల్‌లో 75 బీచ్ విల్లాలు, 35 వాటర్ విల్లాలు ఉంటాయి.


36 ద్వీపాల సమూహాన్ని కలిగి ఉన్న లక్షద్వీప్‌లో బంగారం, అగట్టి, కద్మత్, మినీకాయ్, కవరత్తి, సుహేలి వంటి అనేక ప్రసిద్ధ పర్యాటక దీవులు ఉన్నాయి. కద్మత్ భారతదేశంలోని అత్యంత అందమైన డైవ్ కేంద్రాలలో ఒకటిగా కూడా పేరు సంపాదించింది.


ఇన్నాళ్లు మాల్దీవుల మాయలో పడిపోయిన టూరిస్టులు.. ఇప్పుడు ఒక్కసారిగా లక్షద్వీప్ వైపు మళ్లుతున్నారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ లోని బీచ్‌లలో గడిపిన తీరు, అక్కడి సుందరమైన ప్రదేశాలు చూసిన పర్యటక ప్రియులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు లక్షద్వీప్ కు పర్యటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోతుందని అంచనాలు ఉన్నాయి. అందుకే లక్షద్వీప్ లో పర్యటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సరిపడ హోటళ్లు, రిసార్టులను ఏర్పాటు చేయాలనే వాదన ఊపందుకుంది.