Lok Sabha election 2024 Phase 4 Voting Percentage: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 6 గంటల వరకూ కొనసాగింది. బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు జరిగినా మిగతా చోట్ల మాత్రం ఓటింగ్ ప్రశాంతంగానే జరిగింది. మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా  బెంగాల్‌లో 75.66% పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం సాయంత్రం 5 గంటల నాటికి దేశవ్యాప్తంగా 62% పోలింగ్ శాతం నమోదైంది. ఏపీలో 68.04%, తెలంగాణలో 61.16% పోలింగ్ రికార్డ్ అయింది. బిహార్‌లో 54.14%, ఝార్ఖండ్‌లో 63.14%, మహారాష్ట్రలో 52.49%, యూపీలో56.35%, ఒడిశాలో 62.96%  పోలింగ్ రికార్డ్ అయింది. మధ్యప్రదేశ్‌లో 68.01%, అత్యల్పంగా జమ్ముకశ్మీర్‌లో 35.75% పోలింగ్ నమోదైంది. 


ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అటు పశ్చిమ బెంగాల్‌లోనూ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ దాడుల్లో ఓ టీఎమ్‌సీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. యూపీలో షాజన్‌పూర్‌లోని  కొన్ని గ్రామాలు పోలింగ్‌ని బైకాట్ చేశాయి. మౌలిక వసతులు సరిగ్గా లేవని, ఆ సమస్యలని పరిష్కరించేంత వరకూ ఓటు వేయమని తేల్చి చెప్పారు. శ్రీనగర్‌లో అత్యల్ప ఓటింగ్ నమోదైంది. జమ్మూలోని కశ్మీరీ పండిట్స్‌ ఓటు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. వాళ్లలో చాలా మంది పేర్లు ఓటర్ల జాబితాలో లేదు. మొత్తంగా ఈ నాలుగో విడత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 1,717 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. 17.70 కోట్ల మంది అర్హులైన ఓటర్లున్నారు. వీళ్లలో 8.73 కోట్ల మంది మహిళలున్నారు. ఒడిశాలో ఈవీఎమ్ మెషీన్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. 65 బ్యాలెట్ యూనిట్స్, 83 కంట్రోల్ యూనిట్స్, 110 వీవీప్యాట్‌లను అధికారులు రీప్లేస్ చేశారు. మాక్‌పోలింగ్ సమయంలోనే ఈ టెక్నికల్ గ్లిచెస్ రావడం వల్ల వెంటనే వాటిని మార్చేశారు. ఝార్ఖండ్‌లో మావోయిస్ట్‌లు కొన్నిచోట్ల పోలింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రోడ్లను భారీ చెట్లతో బ్లాక్ చేశారు.