High Tension at AP Polling Centers: ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ముఖ్యంగా తాడిపత్రిలో పోలీసులపై, వారి వాహనాలపై జరిగిన దాడి ఘటన గురించి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాయలసీమలోనే అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గంగా తాడిపత్రి నియోజకవర్గానికి పేరుంది. అలాంటి చోట ఎన్నికల రోజు దారుణమైన రీతిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ ప్రారంభం అయిన కాసేపటికే రిగ్గింగ్ జరుగుతోందని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. దీంతో వైసీపీ, టీడీపీ వర్గాలకు మధ్య ఘర్షణ ఏర్పడింది. వైసీపీ శ్రేణులు ఏకంగా పోలీసులపైకి రాళ్లు రువ్వారనే ఆరోపణలు ఉన్నాయి.


చంద్రబాబు పోస్ట్
‘‘నేటి పోలింగ్ లో వైసీపీ హింస ఎంతవరకు వెళ్లిందంటే... కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే దాడి చేయడం... తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిపై దాడికి దిగడం, వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ఠ. జగన్ 5 ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు.. ఈరోజు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారు. ప్రజలారా.. ఈ కుట్రను మీరే తిప్పికొట్టాలి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ నిర్భయంగా తరలివచ్చి ఓటు వేయాలి. అత్యధిక ఓటు శాతంతో వైసీపీ హింసా రాజకీయానికి ముగింపు పలకాలి’’ అని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.






తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో పోలింగ్ జరుగుతుండగా పరిస్థితి మరీ చేయిదాటి పోతుండడంతో గొడవలను అదుపుచేసేందుకు పోలీసు బలగాలు రంగప్రవేశం చేశాయి. అప్పటికే తాడిపత్రి బందోబస్తులో ఎస్పీ అమిత్ బర్డర్ ఉండగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు రాళ్ల దాడులు జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఇరు వర్గాలపై లాఠీఛార్జి చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. అదనపు బలగాలను పిలిపించినా ఫలితం లేకుండా పోయింది.


రాళ్ల దాడి తాడిపత్రిలోని ఓంశాంతి నగర్‌ ప్రాంతంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య జరిగింది. పోలీసుల పైకి కూడా రాళ్లు రువ్వడంతో వారు ఆత్మరక్షణలో పడ్డారు. భయపడిన పోలీసులు ఇళ్లలోకి దూరి తలుపులు వేసుకున్నారు. ఆఖరికి ఎస్పీ పోలీసు వాహనంపై కూడా దాడులు చేశారు.