I.N.D.I.A Meeting:



డిసెంబర్ 19న సమావేశం..!


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వల్ల ఒక్కసారిగా I.N.D.I.A కూటమి సైలెంట్ అయిపోయింది. యాక్టివ్‌గా ఉన్న కాంగ్రెస్‌ పూర్తిగా ఈ ఎన్నికలపైనే ఫోకస్ చేసింది. ఫలితాలు ఎలా వచ్చాయన్న సంగతి పక్కన పెడితే ఇప్పుడిప్పుడే మళ్లీ కాంగ్రెస్ పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 19వ తేదీన ఈ కూటమి సమావేశమవనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమిలోని కీలక నేతలంతా ఈ సమావేశానికి హాజరు కానున్నట్టు తెలుస్తోంది. అత్యంత ముఖ్యమైన,ఎన్నో రోజులుగా పెండింగ్‌లో సీట్ షేరింగ్‌లోనూ ఈ భేటీలోనే క్లారిటీ రానుంది. ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. అందరి నేతలూ అందుబాటులో ఉంటే అదే రోజు భేటీ కానున్నారు. అయితే...ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలైంది కాంగ్రెస్. హిందీ బెల్ట్‌లో అత్యంత కీలకమైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ని కోల్పోయింది. ఇలాంటి కీలక సమయంలో సీట్‌ షేరింగ్‌పై చర్చ జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ ప్రస్తుతం సీట్‌లను ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశం ఉండకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకూ సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలనూ కలుపుకుపోతోంది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో ఉన్న విభేదాలనూ పరిష్కరించుకుంది. రాబోయే సమావేశంలో అఖిలేశ్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. 


విభేదాల సంగతేంటి..? 


నిజానికి గత వారమే ఈ సమావేశం జరగాల్సి ఉంది. కానీ అఖిలేశ్ యాదవ్, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ సహా మరి కొందరు ముఖ్య నేతలు హాజరు కాలేమని చెప్పారు. ఫలితంగా...తేదీని మార్చాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే కాంగ్రెస్ I.N.D.I.A కూటమి కార్యాచరణపై భేటీకి పిలుపునిచ్చింది. మూడు రోజుల పాటు సమావేశాలు జరగాలని భావించింది. కానీ..అప్పటికి అది కుదరలేదు. ఈ భేటీ జరగకపోయినప్పటికీ...కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో ఓటమిపై రివ్యూ చేసుకుంది. తెలంగాణలో గెలవడం ఒక్కటే ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చింది. ఈ కూటమి ఏర్పాటైనప్పటి నుంచి అంతర్గత విభేదాలు పదేపదే బయట పడుతున్నాయి. అసలు చివరి వరకూ కూటమి కలిసే ఉంటుందా లేదా అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కి కాంగ్రెస్‌తో గతంలోనూ విభేదాలొచ్చాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సీట్ షేరింగ్ విషయంలోనూ కాస్త దూరం పెరిగింది. ఈ సమస్యల్ని దాటుకుని కాంగ్రెస్ కూటమిని ఎలా లీడ్ చేస్తుందన్నదే కీలకంగా మారింది. 


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ విజయం సాధించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజల ఓటమి కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ ఓటమేనని తేల్చి చెప్పారు. I.N.D.I.A కూటమిలోని పార్టీలతో సీట్ షేరింగ్ అంశాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని అందుకే మూడు రాష్ట్రాల్లోనూ పరాభవం తప్పలేదని స్పష్టం చేశారు. పార్టీకి సిద్ధాంతం ఉంటే సరిపోదని, వ్యూహాలూ అవసరమేనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అయినా సీట్ల పంపకాల విషయంలో స్పష్టత వస్తే కచ్చితంగా బీజేపీని ఓడించేందుకు అవకాశాలున్నాయని ధీమా వ్యక్తం చేశారు దీదీ. 


Also Read: Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - విశ్వసనీయ వర్గాల వెల్లడి