Telangana News: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు కూల్​ డ్రింక్స్​ తయారీ చేసే హిందుస్థాన్​ కోకో కోలా బెవరేజెస్​ (HCCB) కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధి బృందం సోమవారం (జనవరి 8) సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కోకో కోలా దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. సిద్ధిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్ లో ఈ కంపెనీ తలపెట్టిన గ్రీన్​ ఫీల్డ్ బాట్లింగ్​ ప్లాంట్​ నిర్మాణంలో ఉంది. తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యం అవుతుందని, అందుకు తగిన విధంగా ప్రాజెక్టులను విస్తరిస్తామని కంపెనీ ప్రతినిధి బృందం సీఎంతో చర్చలు జరిపింది.


పెట్టుబడులకు రక్షణ కల్పించటంతో పాటు పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తగినంత సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ విధానం అమల్లో ఉంటుందని అన్నారు. హిందుస్థాన్​ కోకో కోలా బెవెరేజెస్​ (హెచ్‌సీసీబీ) పబ్లిక్​ అఫైర్స్​ చీఫ్​ హిమాన్షు ప్రియదర్శని, కంపెనీ ప్రతినిధులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.