AP Voter List Issue :  ఓటర్ జాబితాలో అక్రమాలపై టీడీపీ ఇచ్చిన ప్రజెంటేషన్  లో ఉన్న  వివరాల ఆధారంగా అక్రమాలపై చర్యలు తీసుకున్నామని ఏపీ సీఈవో టీడీపీకి లేఖ రాశారు.  గత నెల 23వ తేదీన టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్‌పై తీసుకున్న చర్యలు లేఖలో వివరించారు.  2024 ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబరు 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించాం. డిసెంబరు 9 తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా 2024 జనవరి 12 తేదీలోగా పరిష్కరిస్తాం. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ కేసులు, ఓటు బదిలీ దరఖాస్తులను ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించాం. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 14.48 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించాం. అందులో 5 లక్షల 64 వేల 819 పేర్లను అనర్హులుగా తేలిందని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా  తెలిపారు. 


అక్రమాలకు పాల్పడిన పలువురిపై కేసులు 


అన్ని జిల్లాల కలెక్టర్లూ ఆయా అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఓటర్లుగా ఆన్ లైన్ దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులూ వచ్చాయి. కాకినాడ నగరంలో ఫాం 7ల ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న 13 మంది ఎఫ్ఐఆర్ ను నమోదు చేశాం. ఈ వ్యవహారంలో పోలీసు స్టేషన్లలో అభియోగపత్రాలు కూడా దాఖలు అయ్యాయని లేఖలో పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశపూర్వకంగా ఫాం 7లు దాఖలు చేసిన 6గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. 


పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఓటర్ల జాబితా సవరణ 


పర్చూరులో 10 ఎఫ్ఆర్ లు నమోదు చేశాం. కావలి, గురజాల, బనగానపల్లె, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో ఫాం7 దరఖాస్తుల్లో వచ్చిన అభ్యంతరాలను తనిఖీ చేయించాం. చంద్రగిరి నియోజకవర్గంలో ఉల్లంఘనలకు పాల్పడిన 24 మంది బీఎల్ఓలపై చర్యలు తీసుకున్నాం.. జీరో డోర్ నెంబర్లు, ఒకే ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసుల్లో 97 శాతం మేర తనిఖీలు పూర్తి చేసి ఓటర్ల జాబితా సవరించాం అన్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారిపోయిన ఘటనలూ విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో నమోదు అయ్యాయి. విశాఖలో 26 వేల మంది ఓటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 2,27,906 ఓటర్లకు సంబంధించి ఓటర్లు ఇతర పోలింగ్ కేంద్రాలకు మారింది. గందరగోళం లేకుండా ఈ జాబితాలను సవరించేందుకు కార్యాచరణ చేపట్టాం. 


ఏపీకి రానున్న సీఈసీ రాజీవ్ కుమార్ 


ఓకే చోట 3 ఏళ్లు సర్వీసు పూర్తైన ప్రభుత్వ ఉద్యోగులు, క్రిమినల్ కేసులు నమోదైన వారు, ఈసీ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించిన అధికారుల ఎన్నికల విధుల్లో ఉండరు. ఓటర్ల జాబితా రూపకల్పనలో తప్పిదాలకు సంబంధించి ఇప్పటికే చర్యులు తీసుకున్నాం. ఉరవకొండ, ప్రొద్దుటూరు నియోజకవర్గాల ఈఆర్వోలు, పర్చూరు ఏఈఆర్వో, 1 సీఐ, 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని.. 50 మంది వరకూ బీఎల్వోలపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలిచ్చామని తెలిపారు. మరో వైపు ఏపీలో ఎన్నికల  నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించేందుకు సీఈసీ రాజీవ్ కుమార్ ఏపీకి రానున్నారు. మంగళవారం .. ఆయనను  టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ కలిసి  అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు. అంత కంటే ముందే.. సీఈవో మీనా లేఖ రాయడం ఆసక్తికరంగామారింది.