Haryana Farmers Protest: రైతులపై లాఠీ ఛార్జి చేయడంలో తప్పు లేదు: హరియాణా సీఎం

ABP Desam   |  29 Aug 2021 04:35 PM (IST)

హరియాణా కర్నల్ లో నిన్న రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై ఆ రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. ఆ సమయంలో శాంతిభద్రతలు కాపాడటానికి పోలీసులు లాఠీఛార్జి చేయడం సరైన నిర్ణయమేనన్నారు.

రైతులపై లాఠీ ఛార్జి చేయడంలో తప్పు లేదు: హరియాణా సీఎం

హరియాణాలో శనివారం పోలీసులు చేసిన లాఠీఛార్జిలో 10 మంది రైతులకు తీవ్రగాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు.

పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని సీఎం సమర్థించారు. శాంతియుత నిరసనకే తాము అనుమతి ఇచ్చామని, కానీ రైతులు రాళ్లు రువ్వారని, జాతీయ రహదారిని దిగ్బంధించారని ఆయన అన్నారు. ఇందుకోసమే పోలీసులు లాఠీఛార్జి చేసినట్లు తెలిపారు.

వాళ్లు నిరసన చేయాలనుకుంటే.. శాంతియుతంగా చేయాలి. అలా చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. శాంతియుతంగా నిరసన చేస్తామని రైతులు హామీ ఇచ్చారు. కానీ పోలీసులపై రాళ్లు రువ్వారు, జాతీయ రహదారిని దిగ్బంధించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు                    -   మనోహర్ లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి

కర్నల్ ప్రాంతంలో జరిగింది భాజపా రాష్ట్రస్థాయి సమావేశమని.. దాన్ని అడ్డుకోవాలని రైతులు పిలుపునివ్వడం తగదన్నారు.

పోలీసులకే గాయాలు..

లాఠీఛార్జి ఘటనలో నలుగురు నిరసనకారులకు మాత్రమే గాయలయ్యాయని హరియాణా అడిషనల్ డీజీపీ నవ్ దీప్ సింగ్ అన్నారు. రాళ్లు రువ్వడం వల్ల 10 మంది పోలీసులకు గాయాలైనట్లు తెలిపారు.

కఠిన చర్యలు తీసుకుంటాం..

రైతుల తలలు పగులగొట్టడంటూ పోలీసులకు కర్నాల్‌ జిల్లా ఉన్నతాధికారి ఆయుష్‌ సిన్హా సూచనలిస్తున్న వీడియో శనివారం నుంచి విపరీతంగా వైరల్‌ అయింది. ఈ వీడియోపై హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా స్పందించారు.

రైతుల విషయంలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి భాష మాట్లాడం ఆమోదయోగ్యం కాదు. కచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకుంటాం                        - దుష్యంత్ చౌతాలా, హరియాణా డిప్యూటీ సీఎం

Published at: 29 Aug 2021 04:35 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.