JK Rowling Death Threat:


జేకే రోలింగ్‌కు బెదిరింపులు 


భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి జరగటం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. తీవ్రంగా గాయపడ్డ ఆయన ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. ఆయన రాసిన ఓ నవలపై అభ్యంతరాలున్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు ఆయనకు బెదిరింపులు వచ్చాయి. ఈ సారి అకస్మాత్తుగా దాడి జరిగింది. దీనిపైనే అంతర్జాతీయంగా చర్చ నడుస్తుండగా..మరో ప్రముఖ రచయిత్రికీ  ఇలాంటి బెదిరింపులే రావటం ఆందోళన కలిగిస్తోంది. "నెక్స్ట్ నువ్వే" అంటూ హ్యారీ పాటర్ రచయిత్రి జేకే రోలింగ్‌కు ఓ వ్యక్తి మెసేజ్‌లు పంపాడు. ఆ మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీసి ట్విటర్‌లో షేర్ చేశారు జేకే రోలింగ్. సల్మాన్ రష్దీపై దాడి జరగటాన్ని ఖండిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ట్వీట్‌కు స్పందిస్తూ ఓ యూజర్ "ఏం కంగారు పడకు. నెక్స్ట్ నువ్వే" అని ట్వీట్ చేశాడు. సల్మాన్ రష్దీపై దాడి చేసిన హదీ మతర్‌ను పొగుడుతూ కొన్ని ట్వీట్లు చేశాడు ఆ యూజర్. ఈ ట్వీట్స్‌ను స్క్రీన్‌షాట్స్ తీసి జేకో రోలింగ్ షేర్ చేశారు. తీవ్రంగా గాయపడిన సల్మాన్ నిన్నటి వరకూ వెంటిలేటర్‌పై ఉన్నారు. అయితే...ఆయన ఆరోగ్యం కాస్త మెరుగైందని, వెంటిలేటర్‌ తొలగించారని ఆయన ఏజెంట్ యాంజ్రూ వైలీ వెల్లడించారు. మాట్లాడుతున్నారనీ అన్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం...ఆయన ఓ కన్ను కోల్పోయినట్టు తెలుస్తోంది. కత్తితో తీవ్రంగా పొడవటం వల్ల కాలేయం కూడా తీవ్రంగా గాయపడినట్టు వైద్యులు చెబుతున్నారు.









 


చరిత్రలో ఎప్పుడూ చూడని దారుణం: శ్వేతసౌధం


ఈ దారుణం వెనక ఎవరున్నారన్నది పోలీసులు విచారణ చేపడుతున్నారు. 24 ఏళ్ల కుర్రాడు ఈ దాడి చేసినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. న్యూజెర్సీకి చెందిన హది మతర్ ఈ పని చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. న్యూయార్క్ లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో లెక్చర్ ఇచ్చేందుకు  సిద్ధమవుతుండగా ఆయన వైపు దూసుకొచ్చిన ఓ వ్యక్తి సల్మాన్ రష్దీపై కత్తితో  దాడి చేశాడు. అమెరికా న్యూయార్క్‌లోని చౌతాక్వా ప్రాంతంలోని 
ఓ ఇన్‌స్టిట్యూట్‌లో లెక్చర్ ఇచ్చేందుకు రష్దీ హాజరయ్యారు. కత్తి పోట్లకు గురైన రష్దీ స్టేజిపైనే కుప్పకూలిపోయారు. గాయాలపాలైన ఆయన్ను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై శ్వేససౌధం స్పందించింది. ఇదెంతో షాక్‌కు గురి చేసిందని తెలిపింది. "ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన గాయపడిన వెంటనే సాయం చేసేందుకు ముందుకొచ్చిన వారికి  కృతజ్ఞతలు తెలుపుతున్నాం" అని వైట్‌హౌడ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సల్లీవన్ వెల్లడించారు. "150 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ చూడని సంఘటన  ఇది. అన్ని వర్గాల వారినీ ఒక్కటి చేయాలనే లక్ష్యంతోనే ఈ సంస్థను స్థాపించాం. కానీఈ ఘటన మమ్మల్ని భయానికి గురిచేసింది" అని చౌతాక్వా ఇన్‌స్టిట్యూషన్‌ ప్రెసిడెంట్ మైకేల్ హిల్ అన్నారు. రష్దీ రచించిన మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌ నవలకు 1981లో బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. దీంతో ఆయన ఫేమస్‌ అయ్యారు. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా 1980లో రచించిన ది సాతానిక్‌ వెర్సెస్‌‌ నవల వివాదాలకు మూలమైంది. అప్పటి నుంచి ఆయనకు  బెదిరింపులు మొదలయ్యాయి. 


Also Read: India National Anthem: జాతీయగీతాన్ని తొలిసారి ఎక్కడ ఆలపించారు? సింధు పదంపై వివాదమెందుకు?