Whatsapp Security Bug: 



బగ్ ఉందని చెప్పిన గూగుల్..


కొద్ది రోజులుగా వాట్సాప్ (Whatsapp)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రైవసీ లేకుండా పోతోందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ ట్వీట్‌తో ఈ వివాదం పెద్దదైంది. వాట్సాప్‌ దీనిపై వివరణ ఇచ్చినప్పటికీ...బగ్స్ ఉన్నాయని టెక్‌ ఎక్స్‌పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు గూగుల్‌ కూడా సంచలన విషయం వెల్లడించింది. ఆండ్రాయిడ్‌లో బగ్‌ను (Bug in Android) కనుగొంది. ఈ బగ్‌ కారణంగా వాట్సాప్‌ మైక్రోఫోన్ యాక్సెస్ చేయడానికి వీలవుతోందని తేల్చి చెప్పింది. యాప్‌ని వినియోగించని సమయంలోనూ మైక్రోఫోన్‌ని యాక్సెస్ చేసేందుకు ఈ బగ్‌ కారణమవుతోందని వెల్లడించింది. ఈ మధ్యే వాట్సాప్‌లో మైక్రోఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతోందన్న ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ట్విటర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఒకరు ట్విటర్‌లో ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు. దీన్ని ఎలన్ మస్క్ రీట్వీట్ చేయడం వల్ల చర్చ జరిగింది. చాలా రోజులుగా వాట్సాప్‌లో ఇంటర్నేషనల్ స్పామ్ కాల్స్ వస్తుండటమూ యూజర్స్‌ని అసహనానికి గురి చేస్తోంది. ఈ సమయంలోనే ప్రైవసీలో లోపాలు ఉన్నాయని నిరూపిస్తూ వరుస వార్తలు వస్తుండటం మరింత అసహనం కలిగిస్తోంది. 


ఐటీ శాఖ క్లారిటీ..


వాట్సాప్‌లో ప్రైవసీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ ఈ మెసెంజర్ యాప్‌ను "నమ్మలేం" అంటూ చేసిన కామెంట్స్‌ అంతర్జాతీయంగా దుమారం రేపాయి. దీనిపై భారత ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. వాట్సాప్‌లో ప్రైవసీని ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ట్విటర్‌లోని ఇంజనీరింగ్ డైరెక్టర్ ఫోద్ దబిరి ట్వీట్‌కు స్పందిస్తూ రాజీవ్ ఈ ప్రకటన చేశారు. తాను నిద్రపోతున్న సమయంలో వాట్సాప్‌ తన మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేసిందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు దబిరి. బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేస్తున్నట్టు చెప్పారు. ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఇదే తాను అబ్జర్వ్ చేసినట్టు వెల్లడించారు. ఇదే ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ మరోసారి ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ వాట్సాప్‌పై విమర్శలు చేశారు. "వాట్సాప్‌ని నమ్మడానికి వీల్లేదు" అంటూ ట్వీట్ చేశారు. అయితే...దీనిపై స్పందించిన రాజీవ్ చంద్రశేఖర్ తప్పకుండా విచారణ జరుపుతామని వెల్లడించారు. 


"ఇది కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం. ప్రైవసీని ఉల్లంఘిస్తే సహించం. వెంటనే దీనిపై విచారణ జరుపుతాం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ పాలసీలో భాగంగా చర్యలు తీసుకుంటాం"


- రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ మంత్రి